Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చెదరు మొగంబు రాచెదరు చెట్టుప లూడ్చెద రిట్లు దూతలం
జదుపఁగఁ జూతురే నయవిశారద నావుడు రామునాజ్ఞకున్
వదలిరి వారు వానిఁ జని వాఁడును జెప్పె సురారి కంతయున్.

211


వ.

తదనంతరంబ.

212

శ్రీరాముఁడు దర్భశయనము చేయుట

సీ.

ఎయ్యది బహురత్నహేమకేయూరాదిభూషణలక్ష్మికిఁ బొలుపు నొసఁగె
నెయ్యది మిథిలేశు నింట నిల్లడ యున్న, ధూర్జటివిలు లీలఁ ద్రుంచి వైచె
నెయ్యది సోయగం బెలరార వైదేహి, నేపథ్యరచనల నేర్పు మెఱసె
నెయ్యది సన్నుతు లెసఁగ నిచ్చలు గోస, హస్రప్రదాతృకం బగుచు వెలసె
నట్టిచే దలయంపిగా నవ్విభుండు, దర్భశయనుఁ డై వాసరత్రయము నియతి
నుండ నిజమూర్తితోడఁ బయోధి వచ్చి, తనకుఁ బొడసూపకున్నఁ జిత్తమున నలిగి.

213


శా.

కంటే లక్ష్మణ నన్నుఁ గైకొనక రంగత్తుంగభంగంబు లొం
డొంటిం దాఁకుచుఁ బైపయిన్ నెగయఁగా నుద్వేల మై వార్ధి మి
న్నంటం బొంగెడు నంతకంత కిటు లియ్యాటోప మింకింతు నా
వింటం బుట్టినబాణబాడబముచే వేవేగ వి ల్లీవనా.

214


క.

క్షమయును బ్రియవాదిత్వము, శమమును నార్జవము దుర్విచారులు గడుఁ జా
లమిగా నూహింతురు లో, కము వెఱచుట బెట్టిదంబు గలుగుటఁ జుమ్మీ.

215


క.

గుణహీను లైనవారల, గుణహీనులు మెత్తు రట్టికుత్సితుఁ డగురా
వణునిపొరుగువాఁడట యే, గుణములు గల విందు వెదక గుణరత్ననిధీ.

216


తే.

అనుచు ధను వందికొని యుగాంతాగ్నికరణి
దురవలోకుఁ డై లోకముల్ దిరుగఁబడఁగఁ
జటిలి పడుపిడుగులతోడి చిచ్చఱమ్ము
లమ్మహాంబుధిమీఁద నందంద పఱపె.

217


వ.

అప్పు డాశరపరంపరలు వారిపూరంబుపై నడరిన.

218


మ.

విచలద్వీచులఁ గ్రొంబొగల్ నెగయఁగా వెన్వెంట బాణాగ్ని నం
బుచరవ్రాతము లిట్టు నట్టుఁ బఱవన్ భోగీంద్రలోకంబువా
రచటం గచ్ఛపరాజుక్రిందు సొర నుద్యద్ఘూర్ణనాభీలకీ
లచయోద్ఘట్టనరోచులన్ జలధి గాలం జొచ్చె నచ్చిచ్చునన్.

219


తే.

అపుడు సౌమిత్రి కడుభయ మంది దేవ
వలవ దిట్టులు సైరింపవలయు ననిన
నన్నరేంద్రుఁడు మఱియుఁ గెంపారుచూడ్కి
నిగుడ బ్రహ్మాస్త్ర మరిఁ బోసి తెగ గొనంగ.

220