పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిసారిగా అరెస్టయిన బెంగాల్‌ బేగం సిస్టర్స్‌

బేగం జహీరా-సుల్తానా

భారత స్వాతంత్య్రోద్యామానికి పుట్టినిల్లు బెంగాల్‌. ఈస్ట్‌ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా 1763లో ఫకీర్లు -సన్యాసుల తిరుగుబాటు ఇక్కడే ప్రారంభమైంది. బెంగాల్‌లో పురుషులతోపాటుగా మహిళలు కూడ జాతీయోద్యమంలో ముందున్నారు. పర్దానషీ మహిళలై ఉండి కూడ అరెస్టులకు గురై జహీరా బేగం, సుల్తానా బేగం సోదారీమణులు చరిత్ర సృష్టించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు ఫ్రోఫెసర్‌ అబ్దుల్ రహీంకుమార్తెలు ఈ బేగం సోదరీమణులు. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన

విదేశీ వసుబహిష్కరణ ఉద్యమంలో వారు చురుకైన పాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా

మధ్యం విక్రయశాలలు, విదేశీ వస్తువులను విక్రయిస్తున్న దుకాణాల ఎదుట ఈ వీరి నేతృత్వంలో పికిెంటింగ్ జరిగింది.

ఆ కారణంగా జహీరా బేగం, సుల్తానా బేగంలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంఘటనను పురస్కరించుకుని, 1930 ఆగస్టు 30నాటి అభ్యుదయ అను వార్తా పత్రిక బేగం సోదారీమణుల అరెస్టులకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ బెంగాల్‌ ప్రాంతంలో మొదటి సారిగా అరెస్టయిన ముస్లిం మహిళలు, అని రాసింది.

ఈ సంచలనాత్మక వార్త ముస్లిం మహిళల్లోఉత్సాహాన్ని పెంచింది. స్వరాజ్య సాధన కోసం సాగుతున్నజాతీయోద్యమంలో పాల్గొని, పోలీసుల దాడులను, కిరాతకాలను భరిస్తూ అరెస్టులకు, జైలుశిక్షలకు వెరవకుండా చివరివరకు సాగేందుకు ప్రజలకు ప్రేరణ కలిగించింది.

104