Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 42

వచ్చారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న అధికారులు సమీపం నుండి గురి తప్పకుండా ఆయన మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు నిస్సార్ అలీ కూలిపోయారు. ఈ విధంగా తిరుగుబాటు వీరుడు మీర్ నిస్సార్ అలీ 1832 నవంబర్ 19న యుద్ధరంగంలో శత్రువుతో పోరాడుతూ అమరత్వం పొందారు. ఈ అమరవీరుడి భౌతికకాయానికి తాము స్వయంగా అంత్యక్రియలు జరుపుకుంటామని గ్రామస్థులు అభ్యర్ధించినా, అంగీకరించక మత సాంప్రదాయాలకు విరుద్ధంగా మిగిలిన మృతులతో పాటు ఆయన మృతదేహాన్ని కంపెనీ అధికారులే దహనం చేయించారు.
ముగిసిన పోరాట చరిత్ర
ఈ రణంలో మరో 50 మంది తిరుగుబాటు వీరులు అమరులయ్యారు. విజయం కంపెనీ సొంతమైంది. సర్కేల్ బరియా స్థావరంలో మిగిలిన నాయకులను, దళాలను కంపెనీ సైన్యం నిర్బంధంలోకి తీసుకుని, అలీపూర్ జైలులో బంధించింది. ఆనాడు అలీపూర్ విచారణ గా ప్రఖ్యాతిగాంచిన విచారణ తంతును జరిపి, నిస్సార్ అలీ ప్రధాన అనుచరుడు గులాం మాసుంకు ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష తరువాత నర్కేల్ బరియా గ్రామంలోని నడివీధిలో ఆ పోరాటయోధుడి భౌతికకాయాన్ని రోజుల తరబడి వేలాడదీసారు. ఈ పోరులో తీవ్రంగా గాయపడిన నిస్సార్ అలీ కుమారులు తోరబ్ అలీ, గౌహర్ అలీకు శిక్షలు పడ్డాయి. ఈ సంఘటనలో మొత్తం 197 మందికి కఠిన కారాగార శిక్షలు, ద్వీపాంతర శిక్షలు విధిస్తూ విచారణ సంఘం తీర్పు చెప్పటంతో, భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ' బరానత్ తిరుగుబాటు ' గా ప్రసిద్ధి చెందిన వహాబీల పోరాటం ముగిసింది. ఈ తిరుగుబాటును నడిపి, వహాబీ జనసముదాయాలను బ్రిటీషర్లుకు వ్యతిరేకంగా మోహరింపచేసిన మహానేత మీర్ నిస్సార్ అలీ చరిత్ర ముగిసింది.
బీహార్ కు మారిన పోరాట వేదిక
భారతదేశంలో వహాబీ ఉద్యమానికి ఆద్యుడు, బ్రిటీష్ వలస పాలకులకులకు వ్యతిరేకంగా ఆయుధాన్ని చేపట్టి, ఆ దిశగా వహాబీలను నడిపించిన మహానాయకుడు సయ్యద్ అహమ్మద్ బరేల్వి బాటలో గ్రామీణ ప్రజానీకాన్ని కదలించి కదం తొక్కించిన మీర్ నిస్సార్ అలీ అమరత్వం పొందాక, వహాబీల పోరాట కేంద్రం బెంగాల్ నుండి బీహారు మారింది. సయ్యద్ అహమ్మద్ వాయవ్య సరిహద్దు ప్రాంతంలో తన పోరాట స్థావరం ఏర్పాటు చేసుకోకముందే, బీహార్ లోని పాట్నాను వహాబీల వెలుగులను ప్రసరింపచేయగల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని దీక్షతో కొనసాగించడానికి సమర్థులైన నాయకులను కూడా ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు. ఆ నాడు నిత్నా కేంద్రంగా బ్రిటీషర్లమీద యుద్ధం ప్రకటించినప్పుడే అవసరమగు ఆహారపదార్ధాలు, ఆయుధాలు, కార్యసాధకులను సమీకరించి పాట్నానుండి పంపడం జరిగేది. ఆ సమయంలో బెంగాల్లోని 10 జిల్లాల్లో ఉధృతంగా సాగిన బరాసత్ తిరుగుబాటు గురించి బీహార్ ప్రాంతానికి అంతగా సమాచారం లేదు. తిరుగుబాటు ముగిసాక మీర్ నిస్సార్ ఆలీ ఆయన సహచరుల త్యాగపూరిత బలిదాన చరిత్రలు అన్ని ప్రాంతాలకు