పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


పొరుగుదేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలు, వివాదాలు స్వాతంత్య్రోద్యమ కాలంనాటి హిందూ - ముస్లింల ఐక్యతకు చిచ్చుపెట్టాయి. భారత విభజనానంతర పరిణామాల వలన అపరాధ భావనకు గురిచేయ బడిన ముస్లిం సమాజం సుషుప్తావస్థలోకి నిష్క్రమించింది. యుద్ధాలు, వివాదాలు, దేశంలో తరచుగా సాగిన మతకలహాలు మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య మానసిక విభజనకు కారణ మయ్యాయి.

ప్రజల మత మనోభావాలను రెచ్చగొట్టి మతం పేరుతో మనుషులను చీల్చి, రాజకీయ ప్రయోజనాలను సాధించదలచిన మతోన్మాద రాజకీయశక్తులు, వ్యక్తులు ఈచీలికను అగాధంగా మార్చాయి. పర్యవసానంగా బ్రిటీషర్ల బానిసత్వం నుండి మాతృభూమిని విముక్తం చేసేందుకు సాగిన సుదీర్గ పోరాట చరిత్రలో ముస్లిం సమాజం త్యాగాలు మరుగునపడిపోయాయి.

ప్రజలకు చేరువకాని సమాచారం

చరిత్ర గ్రంథాలలో ముస్లింలు చాలా వరకు కన్పించరు. ఒకరిద్దరు కన్పించినా అనన్య సామాన్యమైన వారి త్యాగాలు, సాధారణ స్థాయి వివరణలతో, వర్ణనలతో సరిపెట్టబడతాయి. ప్రాచుర్యంలో ఉన్నచరిత్ర గ్రంథాలలో ముస్లింల వీరోచిత గాధలు సరైన స్థానం పొందలేకపోయాయి. కనుక ఆయా కథనాలు సామాన్య చరిత్ర గ్రంథాలలోగాని, పాఠ్య పుస్తకాలలోగాని చోటు చేసు కోలేదు . ఫలితంగా భవిష్యత్తు తరాలకుఅమూల్య సమాచారం అందకుండా పోయింది.

చరిత్ర ద్వారా తేలిగ్గా సమాచారం లభించే అవకాశం లేనందున, కళా రూపాలకు, సాహిత్య ప్రక్రియలకు, ప్రచార మాధ్యమాలకు ముసింల శ్లాఘనీయ చరిత్రలు కథా వస్తువు కాలేకపోయాయి. ఆ కారణంగా ముస్లింల త్యాగాలు, ఆనాటి వీరోచిత సంఘటనలు జనబాహుళ్యంలోకి వెళ్ళకపోవటంతో ఆ తరువాత తరాలకు ఆ విషయాలు అందలేదు. ఈ పరిణామాలే భారతదేశంలోని హిందూ-ముస్లిం జనసమూహాల మధ్య మానసిక ఎడం ఏర్పడానికి ప్రధాన కారణమయ్యాయి.

ఈ మానసిక అగాథాన్ని మరింత పెంచి ఒక సాంఫిుక జనసమూహానికి తామే ఏకైక ప్రతినిధులుగా ప్రకటించుకుని రాజ్యమేలాలని ఆశిస్తున్నశక్తులు-వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి.

12