పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/743

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

253


ప్రాకులాడువారి సంఖ్య హెచ్చుననియు జీతములు తగ్గించవచ్చుననియు సెలవిచ్చిరి! ఇట్లు విశ్వాసపాత్రులగు చౌకబారు నేటీవు నౌకరులను నిర్మించుటయే ఈవిద్యావిధానముయొక్క ప్రధానోద్దేశముగ నుండెను. ఇది ఫలించి సర్కారుగులాపు వారి తరగతియొకటి బయలుదేరినది. వీరిబానిసబుద్ధి జగత్ప్రసిద్ధము .

భారతీయులలో నిజదేశవేషభాషలపైన స్వదేశనాగరకత మతములపైన అభిమానముపోగొట్టి ఆంగ్లేయ సభ్యతపైన వేషభాషలపైన క్రైస్తవ మతముపైన నభిమానముగౌరవము కలిగించుటకూడా ఈ విద్యావిధానముయొక్క ప్రధానోద్దేశములలో నొక్కటిగనుక క్రైస్తవ మతము, బైబిలుకధలు బోధించుట భారతదేశవేదశాస్త్రపురాణములను గూర్చిన వెక్కిరింపులు నీయాంగ్ల పాఠశాలలందు పరిపాటియయ్యెను. ప్రభుత్వోద్యోగులు క్రైస్తవమతాచార్యులకు సాయము చేయుచు పరీక్షలందు ప్రపంచజ్ఞానమునుగూర్చిన ప్రశ్నలని పేరుపెట్టి బైబిలుకధలనుగూర్చి ప్రశ్నించి అవిచెప్పలేని వారిని తప్పించుచుండిరి. పరీక్షతప్పినవారి కుద్యోగములులేవు. ఇట్లు విజాతీయమతప్రచారము జరుగుచుండెను. భారతదేశనాగరకతను, మతములను నిరసించి క్రైస్తవ ధర్మములను పొగడినవారికే యుద్యోగములు వచ్చుచుండెను. ఈయన్యాయములనుగూర్చి రాజారామమోహనరాయలనాటినుండి స్వాతంత్ర్యవిప్లవమువరకు ఆందోళన జరిగెను.

వైజ్ఞానిక పారతంత్ర్యభూతమింతటితో మనలను వదల