పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/742

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

భారతదేశమున


ప్రభువులయూహ ! ఈమహానుభావు డింతటితో నూరకొనలేదు. 1853 లో మఱల నిట్లుచెప్పినాడు. “ఇప్పుడు మనము ముఖ్యముగా చేయవలసిన కర్తవ్యము; మనము పరిపాలించు లక్షోపలక్షల జనములకును మనకును మధ్యనొకరిభాష నింకొకరికి తెలుపు 'ద్విభాషీ ' లుగా నుండి రక్తములోను రంగులోను భారతీయులై (అనగా జన్మవలన మాత్రమే భారతీయులుగా నున్నను) రుచులలోను, అభిప్రాయములందును, నీతియందును, విజ్ఞానమందును కేవలము ఆంగ్లేయులుగనేయుండు నొకతరగతి వారిని సృజియించుటకు మన యావచ్ఛక్తిని వినియోగింపవలెను."

"నేటివు" (భారతీయు) లందు విద్యావ్యాప్తి చేయుటకుగల ముఖ్యకారణములలో నొకటి ప్రభుత్వోద్యోగములందు వారిని నియమించు పరిస్థితి కలుగుటయని బొంబాయి గవర్నరుగనుండిన సర్ జాన్ మాల్కలంగారు 1828 లో స్పష్టముగా చెప్పి ' దీనివలన ఖర్చుతగ్గును;కొంత దేశాభివృద్ధియు కలుగును;బ్రిటీష్ పరిపాలన గట్టిపడు'ననియు చెప్పినాడు. 1854 లో కంపెనీ పరిపాలకులు విద్యావిధానమునుగూర్చి జారీచేసిన (ఎడ్యుకేషనల్ డిస్పాచి) తాఖీదులోకూడా ఈవిద్యాభివృద్ధి ప్రభుత్వమువారి నౌకరీలోనుండు ఉద్యోగులకు శక్తిసామర్థ్యములను తెలివితేటలను హెచ్చించునని వ్రాసియుండిరి. మాల్కలంగారు వ్రాసిన మినిట్సులో నేటివులలో విద్యనేర్చినవారు తక్కువగా నున్నందుననే హెచ్చుజీతములు ఇవ్వవలసి వచ్చుచున్నదనియు విద్యాభివృద్ధిచేసినచో ఉద్యోగములకొరకు