పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/741

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

251


రాజ్యతంత్రజ్ఞుల యొక్క నిజోద్దేశము భారతీయులకు విద్యాభివృద్దిగావించి విజ్ఞాన వికాసము కలిగింపవలెననికాదు. కేవలము బ్రిటీషు పరిపాలనకు అనుకూలములగు పరిస్థితులు కలిగించుటకును, బ్రిటీసువారి నాగరకత, వారిపద్ధతులును భారతీయులర్థము చేసికొని వారిపట్ల గౌరవభావము, స్నేహభావము కలిగించుటకే ఈయాంగ్ల విద్యావిధానము నెలకొల్పబడినదనికంపెనీ ప్రభుత్వమున అనేక గొప్పయుద్యోగములు చేసి మద్రాసు గవర్నరైన సర్ ఛార్లెస్ ట్రెవెలియన్ గారు తనపుస్తకములో స్పష్టముగా చెప్పియున్నారు. పూర్వము రోమునగర సామ్రాజ్యములో సామ్రాజ్యాధీశులు జయించిన వివిధజాతుల నెట్లు వైజ్ఞానిక పారతంత్ర్యమున ముంచినారో ఆ ప్రకారమే నేడు భారతీయులనుగూడ తమస్వదేశవేషభాషలపైన నాగరకతపైన అభిమాన శూన్యులుగ జేసి విజాతీయ నాగరకతావ్యామోహమున ముంచుటయే ప్రధాన కర్తవ్య మనియు బయల్పరచినారు. ఈ సంగతి వంగరాష్ట్రమున ఆంగ్లవిద్యాభివృద్ధి ప్రయత్నము జేసిన వారిలో నొకడగు రెవరెండ్ అలెగ్జాండర్ డఫ్ గారుగూడ చెప్పియున్నారు. భారతదేశమునకు సాలుకు 15 వేల పౌనుల జీతముపైన లా మెంబరుగాను లా కమిషనరుగాను వచ్చిన లార్డు మెకాలేగా రీ విద్యావిధానము యొక్క పరమోద్దేశమును 1836 లో నిట్లుచెప్పినారు. "మనవిధాన మమలుజరిగినచో వంగరాష్ట్రమునముప్పదేండ్లలో నొక్కవిగ్రహారాధకుడైన మిగులడని నా విశ్వాసము." ఇట్లు మనదేశముయొక్క నాగరికతను మతమునుగూడ రూపుమాపవలెనని ఈయూంగ్లేయ