పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

భారతదేశమున


నై దవవంతు చదువగలవారని "విలియంవార్డు" చెప్పినాడు[1] ‘బిటీషుఇండియాలో 1854 కు పూర్వమును 1870-71 లోను విద్య' అనుపేరున ఏ. పి. హొవెల్‌గారు వ్రాసిన గ్రంథములో 1835 నాటికే వంగరాష్ట్రమున 100000 దేశీయ గ్రామపాఠశాల లుండెననియు 1822 నాటికి మద్రాసులో సర్ తామస్ మన్రోగారి విచారణవలన 12498 గ్రామపాఠశాలలు 188650 విద్యార్థులుండినట్లు తేలినదనియు వ్రాసినారు.

ఇట్టి స్థితిలో నానాడు మెల్ల మెల్లగా బ్రిటీషువారి వశమగుచున్న వివిధ రాష్ట్రములందలి గ్రామపంచాయితీలును ఇతరసంస్థలతో పాటు ఈ పురాతన పాఠశాలలును కూడ క్రమక్రమముగా నాశనమై పోవుచుండెను. ఇట్లు పూర్వపు విద్యావిధానము నాశనము కాగా దేశప్రజలకు ప్రభుత్వమువలన విరివిగా విద్యనేర్పబడకపోగా అజ్ఞానము వర్ధిల్లసాగెను. ఆంగ్లేయకంపెనీ ప్రభుత్వము నందలి విద్యావిధానమున జనసామాన్యములో విద్యాభివృద్ధిచేయు మాట నటులుండనిచ్చి దేశములో చదువను వ్రాయను మాత్రమైన నేర్పుట, అనగా అక్షరజ్ఞానము కలిగించు పద్దతియైన, వృద్ధిజెందలేదు సరికదా పూర్వమునాటికన్న క్షీణించిపోయెను.[2] 1870 నాటికి దేశములో అక్షరాస్యులు నూటికైదుమంది మాత్రమే యుండిరి! ఈ విపరీతపరిణామమునకు గారణములేకపోలేదు. ఆంగ్ల విద్యావిధానమును నెలకొల్పుటలో బ్రిటీషు.

  1. (Ancient Indian Education - Rev. F. E, Keay)
  2. 1858 నాటి స్థితిగతులకు 133 - 134 పుటలు చూడుడు.