పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

భారతదేశమున

ప్రభుత్వమంతయు ప్రజాప్రతినిధులయిష్టానుసారముగా మంత్రులసలహా సహాయములతో జరుగవలెనను ప్రజాప్రభుత్వ పద్ధతి, రాజ్యాంగచట్టమునుబట్టియే మనకు లేకపోగా చట్టము మినహాయింపగా మన ప్రజాప్రతినిధులకు మిగిలిన ప్రభుత్వాధికారములైనను మంత్రుల సలహాసహాయముల ప్రకారము ప్రజాప్రతినిధుల యిష్టానుసారముగా పరిపాలింపబడునా అనునది పై కారణములనుబట్టి కేవలము రాజ్యంగకార్యదర్శియొక్కయు అతనితాబేదారులగు గవర్నరుజనరలు, గవర్నరులయొక్కయు చిత్తముల పై నాధారపడియుండును. సామాన్య పరిపాలనమునందు గూడ మంత్రులపరిపాలనయు, శాసనసభల చట్టములును తమప్రత్యేకబాధ్యతలకు భంగము కలిగించునను నెపమున మంత్రులను శాసనసభలనుగూడ త్రోసిరాజని స్వబుద్ది నుపయోగించి విశేషాధికారములను చలాయించి నిరంకుశ పరిపాలన జరుపవచ్చును. అందువలననే సామాన్య పరిపాలనమందైనను ప్రజాప్రభుత్వపద్దతి పాటింపబడునని అనగా మంత్రులసలహా ప్రకారమే పరిపాలన జరుగుననియు చట్టముప్రకారము మంత్రులు ప్రవర్తించునంతవరకు గవర్నరులు తమవిశేషాధికారములను ప్రయోగించి నిరంకుశముగా, ప్రవర్తింపరనియు, ఒక రాజ్యాంగమర్యాద ఏర్పడుట అత్యంతావశ్యకమైనది. ఇట్టి మర్యాద పాటింపబడునని బ్రిటీషుసామ్రాజ్యప్రభుత్వము తరఫున వారిరాజ్యాంగ కార్యదర్శియు గవర్నరుజనరలును ప్రకటన చేయువరకును రాష్ట్రములందు కాంగ్రెసువారు మంత్రిత్వాధికారములను స్వీకరింపలేదు.