పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/629

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

139


సౌకర్యముల కొరకు రు.17,68635 లు మాత్రము కర్చుపెట్టిరి. అనగా సాలుకు రు 3 1/2 లక్షలు! ఆరోగ్యముకొరకు గూడ 17 1/2 లక్షలే ఖర్చుపెట్టబడెను. అయితే 1901-02 సంవత్సరము కన్న హెచ్చుగా 27 కోట్ల రూపాయిలు సైన్యముక్రింద వ్యయము చేయబడెను ! ! 60 కోట్లు రైళ్లకొరకు ఖర్చుపెట్టబడి దానిలో 19 కోట్ల రూపాయలు దేశాదాయములోనుండియే వ్యయము చేయబడినవి. ప్రజల వ్యవసాయాభివృద్ధి కుపయోగించు కాలువలు మున్నగు వానికన్న విదేశీయులకు లాభముకలిగించు ఈ రైళ్ల నిర్మాణమునకే ప్రాముఖ్య మియ్యబడినది.”

గోఖలేగారే లండనులో 1905 నవంబరు 15 వ తేదీన నేషనల్ లిబరల్ ఫెడరేషనులో సుపన్యసించుచు నీ దేశముయొక్క దారిద్ర్యము హెచ్చగుచుండుటయు ఇతరదేశములందు వేయిమందిలో మరణించువారిసంఖ్య క్రమక్రమముగా తగ్గుచుండగా నీ దేశములో విపరీతముగా పెరిగిపోవుచుండుటయు చెప్పి యీదిగువ అంకెల నుల్లేఖించిరి. ఈయన 1908 లో గవర్నరు జనరల్ శాసనసభలో గూడ నీ సంగతులనే మఱలచెప్పిరి. 1881-1886 మధ్య ప్రారంభములో నీ దేశములో 1000 మందికి మరణములు 24 మందిమాత్రమే. తరువాత నీసంఖ్య 25 మందికి పెరిగెను.

1886-1888 మధ్య ఈసంఖ్య 28 కి పెరిగెను.

1890-1895 మధ్య 30 కి పెరిగెను

1896-1900 మధ్య 32.5 కి పెరిగెను.

1900-1905 మధ్య 36.14 కి పెరిగెను.