పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

99


మెంటువా రీదేశాదాయము ఖర్చు పెట్టరాదను నొకనియమము చేయబడెను. సీమలో కావలసిన ఖర్చులన్నియు నీదేశాదాయము నుండియే వ్యయము చేయబడును. ఇండియామంత్రి జీతము కార్యాలయ ఖర్చు, తక్కిన రాజ్యాంగ మంత్రులవలె కామన్సుసభలో వోటుకు పెట్టబడవు. భారతదేశ ఆదాయ వ్యయ లెక్కలు ప్రజల నైతిక ఐహికాభివృద్ధిని గూర్చిన నివేదికయు ప్రతియేటను పార్లమెంటు ఎదుట పెట్టబడవలె నని నిర్ణయింపబడెను.

II

స్వదేశసంస్థానములు[1]

1858 వ సంవత్సరపు రాజ్యాంగచట్టమునుబట్టి స్వదేశ సంస్థానధీశులందరు ఇంగ్లాండురాణీయెడలను ఆమెసంతతివారియెడలను విధేయులై వారి సర్వాధికారమునకు లోబడియుండునట్లు రాజ్యాంగధర్మమునుబట్టి స్థిరపడినది. ఆనాటి గవర్నరు జనరలగు క్వానింగు మొదటి వైస్రాయిగా ప్రకటింపబడెను. సంస్థా

  1. బ్రిటిషువారు మనదేశము నాక్రమించిన కాలములో కొందరురాజులు వారికి సహాయము చేసియు వారి నాశ్రయించియు వారితో సంధియొడంబడికలు చేసికొనియు తమరాజ్యములు కొన్ని షరతులకులోబడి నిలుపుకొనిరి. ఈ రాజ్యములే నేటి స్వదేశ సంస్థానములు. ఇవి స్వతంత్రరాజ్యములుకావు. ఇవి బ్రిటిషు సార్వభౌమ ప్రభుత్వముయొక్క ఆదుపుఆజ్ఞలకు లోబడి బ్రిటీషు సామ్రాజ్యములో చేరిన తాబేదారీ పాలిత రాజ్యములు. ఈ సంస్థానాధీశులకును బ్రిటిషు ప్రభుత్వమునకును మధ్య అమలులోనున్న ఒడంబడికలనుబట్టి వీని అధికారములు గౌరవములు యేర్పడియున్నవి. ఎప్పటికప్పుడు ఇంగ్లండునుండి ఇండియా రాజ్యాంగ కార్యదర్శి జారీచేయు తాఖీదుల ననుసరించి భారత దేశములోని ఆంగ్లరాజ ప్రతినిధియగు వైస్రాయి ఈ సంస్థానములపైన అధికారములు చలాయించుచుండును. బ్రిటిషు ప్రభుత్వము తరఫున 'రెసిడెంట'ను పేర నీ సంస్థానములందొక బ్రిటీషు అధికారి యెల్లప్పుడు నిలిపియుంచబడును. అతడు వైస్రాయికి బాధ్యుడై యుండును. సంస్థానాధిపతులు తమ రాజ్యములను ఈ రెసిడెంట్లయొక్క సలహాను పొందియే పరిపాలించుచుందురు. రెసిడెంట్లను మంచిచేసికొనినచో సంస్థానముల అంతరంగికి పరిపాలనములో సంస్థానాధిపతు లెంత నిరంకుశముగా ఎంత అన్యాయముగా ప్రవర్తించినను చిక్కు ఉండదు. చాలమంది సంస్థానాధిపతులు తమరాజ్యములను తమస్వంతఆస్తిగా అనుభవించుచు ప్రజలపైన పన్నులు విధించి వసూలుచేసి తమయిచ్చవచ్చినట్లు ఖర్చుపెట్టుచుందురు. సంస్థాన పరిపాలనమునందు ప్రజల కెట్టిఅధికారములును లేవు. ఇటీవల మైసూరు తిరువాన్కూరు కొచ్చిను మొదలగు సంస్థానములందు ప్రజాప్రతినిధి సంస్థలు నెలకొల్పి పరిపాలనలో ప్రజలకు కొంచెము ప్రవేశము గలిగించుట జరుగుచున్నను మొత్తముమీద నీ సంస్థానముల పరిపాలనా విధానము నిరంకుశ రాజరికముగనే యున్నది

    ఈ సంస్థానాధిపతు లొండొరులతోగాని విదేశములతో గాని రాజ్యాంగవ్యవహారములు జరుపుటకువీలులేదు. ఆయధికారము సార్వభౌమ ప్రభుత్వమువారికి మాత్రమేకలదు. సంస్థానముల ఆంతరంగిక వ్యవహారము లందు శాంతికి భంగము కలిగినచో మాత్రము బ్రిటీషుప్రభుత్వము వారు జోక్యము కలిగించుకొందురు. సంస్థానములో దుష్పరిపాలనము ప్రబలినట్లు గాని, సంస్థానాధీశుడు పరిపాలించుట కశక్తు డైనట్లుగాని సంస్థానము బ్రిటీషుప్రభుత్వముపట్ల రాజద్రోహము చేయుచున్నట్లుగాని బ్రిటీషు సార్వభౌమ ప్రభుత్వమువారికి రూఢియైనచో తగుచర్య గైకొందురు. ఇట్టిసంస్థానములలో సాధారణముగా అన్యాయములు జరుగుచు నేయుండును గాని బయటకురావు. ఇట్టి సంస్థానములు పెద్దవి చిన్నవి కలిసి రమారమి 600 కలవు. కొన్ని సంస్థానములు పేరునకే సంస్థానములుకాని నిజమునకు చిన్న జమీందారీలేయని చెప్పవచ్చును.