పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/550

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

భారతదేశమున


రాజ్య మెంతో యనాగరకరాజ్యమనియు, అందలి ప్రజ లజ్ఞానులనియు, అనాగరికులనియు, వీరికి స్వరాజ్యార్హత లేదనియు తాములేకున్నచో జాతిమతభేదములవలన ఒండొరుల గొంతుకలు కోసికొన సిద్ధపడుదురనియు, అందువలన గూడ వారుస్వపరిపాలనమునకనర్హులనియు ప్రపంచమునకు వెల్లడించి, తామెంతో దయార్ద్రహృదయులును, ధర్మబుద్దిగల ఉదారస్వభావులు నై నందుననే ఇంత కష్టపడి భారతదేశము నింత న్యాయముగా పరిపాలించుచున్నా మనియు, కేవలము పరమార్థచింతతోనే ఈరాజ్యాంగసంస్కరణ చేయుచున్నామనియు ప్రపంచమునకు చూపుటకుగూడ కొన్ని సారవిహీనములగు అధికారముల నొసగుచు నీరాజ్యాంగమును తయారుచేసినారు. భారతదేశ భాగ్యభోగ్యములనెల్ల తాము స్వప్రయోజనార్థము వినియోగించుకొనుచున్న సంగతి కప్పిపుచ్చి తమయౌదార్యయగుణమును చాటుకొనుటకు గూడ బ్రిటీషుప్రభుత్వమువా రీతంత్రములెల్ల చేసి ఈ బొమ్మకొలువుసభలు, వీనిలోని సమాలోచనలు నడిపి తుదకీ వింతరాజ్యాంగమును చేసినారు. ఈ సమాలోచనము లందు బ్రిటీషువా రెంత తెలివితేటలతో తమ రాజ్యతంత్రమును ప్రయోగించిరో రెండవ రౌండు టేబిలు సభయందు తెరవెనుక మహమ్మదీయులతోను ఇతర అల్పసంఖ్యాక జనసంఘముల ప్రతినిధులతోను ఇంగ్లాండుదేశ కన్సర్వేటివు నాయకులు జరిపిన కుటిలనీతికుట్రలలోనే బయల్పడినది. దాని ఫలితముగా స్వార్థత్యాగియు ప్రపంచమునందెల్ల గౌరవ్యుడు నగుమహాత్ముని సలహాలుకూడా వారు తృణీకరించి భార