పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

410

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

“మార్పుదలకాలమునకావశ్యకములగు రక్షణలను శాసనములందు నెలకొల్పునప్పుడు అట్లు మినహాయింపు చేయబడు (reserved) అధికారములు క్రొత్తరాజ్యాంగముద్వారా తన ప్రభుత్వమునకు భరతఖండమే సంపూర్ణ బాధ్యతను వహించు రాజ్యాంగాభివృద్ధి కెంతమాత్రమును భంగకరములు గాకుండునట్లు నిర్నయింపబడి అట్లే చలాయింప బడునట్లును చూచుట బ్రిటీషు సామ్రాజ్యప్రభుత్వమువారి ముఖ్యకర్తవ్యముగ నుండును." అని ప్రకటించుచు, రామ్శేమెకానల్డు ప్రధానామాత్యుడు “బ్రిటిషుప్రభుత్వమువా రీ ప్రకటనమందు సూచించిన రాజ్యాంగము నాచరణలో పెట్టుటకు వలసిన కొన్ని ముఖ్య విషయములు నిశ్శేషముగ సిద్ధాంతీకరింపబడి యుండలేదని ప్రభుత్వమువా రెఱుగుదురు. అయితే ఈ రౌండుటేబిలు సభలోజరిగిన పనివలన ఆవిషయములన్నియు నొక మార్గమునకు తేబడినవి. ఇందువలన నీప్రకటన యనంతరము జరుగుకార్యాలోచనములు సఫలత గాంచునను ఆశకలుగుచున్నది.” అని సభలో పలికెను. పైనచెప్పబడిన సూత్రములకు లోబడి రౌండుటేబిలు సభవారు సూచించిన రాజ్యాంగ సంస్కరణములు బ్రిటీష్ ప్రభుత్వమున కిష్టమే యనియు ఆరాజ్యాంగప్రణాళిక నింకను బాగుగ యోజించుటకు రౌండుటేబిలుసభ మఱల సమావేశ మగుననియు అందులో కాంగ్రెసుపక్షమువారుకూడ పాల్గొని సహకారముచేయుట కిష్టపడినచో బాగుండుననియు అందు కొరకు తగిన ప్రయత్నములు గావింపబడుననియు గూడ అతడు ప్రకటించెను. అంతట గాంధిమహాత్ముడును కాంగ్రెసు నాయకులును విడుదల గావింపబడిరి.