పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోంరూలు - స్వరాజ్యోద్యమము

379


చుటలో బ్రిటిషువారొక గొప్పతంత్రమును పన్నిరి. దేశమునకు నిజముగా బాధ్యతాయుత స్వపరిపాలనము నిచ్చినచో తమ క్షేమలాభములకు భంగము కలిగితీరునని వారికి భయము కలిగెను. అందువలన తాము భారతదేశమున పొందుచున్న లాభముల కెట్టి భంగమును కలుగకుండునట్లు తగు బందోబస్తులెల్ల జేసికొనవలెను. పైకి కొంత భారతీయులకు మేలుచేసినట్లు కనపడవలెను. అందువలన ఈ ఉద్దేశములను లోపలపెట్టుకొని రాజ్యాంగ సంస్కరణములను గూర్చిన విచారణయను నొక నాటకమును జరిపిరి, 1918 లో నే మాంటేగ్యూ షెమ్సుఫోర్డు నివేదికను ప్రకటించిరి. ఇదియంతయు నాటకమనియు వారు చేయదలచుకొన్న సంస్కరణల ప్రణాళిక అదివరకే నిర్ణయింపబడి యుండెననియు ఇటీవల బయల్పడెను. మాంటేగ్యూ యిక్కడకు వచ్చినప్పుడు స్వరాజ్యము గోరుచు చేయబడిన లక్షలకొలది సంతకములుగల మహజరులతని కర్పింపబడెను. అయినను మాంటేగ్యూ షెమ్సుఫోర్డు రాజ్యాంగ సంస్కరణములలో మందునకైన స్వరాజ్యము గానరాదయ్యెను. ఇది భారతీయుల కెల్లరకును ఆశాభంగము కలిగించెను. "ఈసంస్కరణములు బ్రిటిషువారు ప్రసాదించుటకుగాని భారతీయులు స్వీకరించుటకుగాని యోగ్యమైనవి కావ"ని అనీబిసెంటు వ్రాసెను.

దేశములోని కాంగ్రెసువాదులలో చాలమంది మాంటేగూసంస్కరణములను నిరాకరింపవలెననిరి. కాని లోకమాన్య తిలకును గాంధిమహాత్ముడును ఈ రాజ్యంగమును స్వీకరించి వీనిని ఉపయోగించుకొని క్రొత్తవాని కొరకు ప్రయత్నింత