పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందేమాతరం

365


మున పెద్ద కదలిక పుట్టలేదు. నేడు ముట్నూరికృష్ణారావు పంతులుగారి సంపాదకత్వమున ఆంధ్రదేశమున కఖండ సేవచేయుచున్న కృష్ణాపత్రిక 1902 లో స్థాపించబడెను. దానికి కొండ వెంకటప్పయ్య పంతులుగారు మొదటి సంపాదకులుగ నుండిరి. ఆనాడు ఆంధ్రదేశమున వీరేశలింగము పంతులుగారి ఉద్గ్రంథములు, సంఘసంస్కార కార్యక్రమము, బ్రహ్మసమాజ బోధలు, రామకృష్ణ వివేకానంద విజ్ఞానము, గ్రంధాలయములద్వారా ఉపన్యాసములద్వారా దేశభక్తిపూరితములగు నాటకములద్వారా నలుగడల వ్యాపించెను. భారతదేశములో నాడు కిరీటములేని రాజుగానుండిన తిలకుమహారాజుయొక్క దేశభక్తిపూరితములగు వ్యాసములు వ్యాసంగములు ప్రతిరాష్ట్రమునందును ప్రజాహృదయమునందు దేశాభిమానము పురికొల్పినట్లే మన రాష్ట్రమునకూడ పురికొల్పుచుండెను. ఇట్టి తరుణమున వంగరాష్ట్రమునుండి బిపినచంద్రపాలు వందేమాతర సందేశమును గొనివచ్చి ఆంధ్రదేశమునందు గొప్ప యుపన్యాసముల నిచ్చుచు పర్యటనము చేయసాగెను. ఆతనిమాటలు వినిన వారెల్లరు పరవశులై తత్క్షణమే విదేశవస్తు బహిష్కార దీక్షను గైకొనసాగిరి. నాడుప్రజలు ధరించుచుండిన మల్లుబట్టలను విసర్జించి స్వదేశమిల్లుబట్టలను ధరింపసాగిరి. వందేమాతరమను మాట దేశములో ప్రతిధ్వను లిచ్చుచుండెను. ఎచ్చటచూచినను దేశభక్తిపూరితములగు పాటలు భజనలు ఉపన్యాసములు ఎచ్చటచూచినను లోకమాన్యుని తిలకధారణము, ఎచ్చట చూచినను వ్యాయామ క్రీడలు,