పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

356

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


భాషాపత్రికలు దేశాభిమానమును ప్రోత్సాహించి ప్రజలయందు గాఢమగు దేశాభిమానమును వ్యాపింప జేయుచుండెను. ఇంతలో కఱవులు వచ్చి ప్రజలు బాధపడుచుండిరి. 1896 లో కఱవుకు తోడుగ మహమ్మారి వ్యాపించెను. దీనినిగూర్చి ప్రభుత్వోద్యోగు లవలంబించినచర్యలు, బలవంతపు సంసర్గనిషేధపు పద్దతులు.. ప్రజలయందు అశాంతిని ప్రబలించెను. అప్పుడు లోకమాన్య తిలకు మహాశయుడుగూడ జాతీయ ప్రబోధము గావించుచుండెను. యువకుల నెల్లరను బలశాలులై తేజముగల్గి దేశోద్ధరణ చేయుడని ప్రోత్సహించుచు శివాజీ గణపతి యుత్సవములకు ప్రోద్బల మొసగెను. ఈయన శాసనసభయందుగూడ అప్పుడు సభ్యుడుగా నుండెను. కఱవునుగూర్చియు ప్లేగు నిబంధనలను గూర్చిన ప్రభుత్వ చర్యలను తీవ్రముగా విమర్శింపసాగెను. దేశములో అశాంతి కితడే కారణమని ప్రభుత్వమున కీయనపైన కోపముగా నుండెను.

దేశ మిట్లు దారిద్ర్యమున కఱవులో మునిగి ప్లేగు వలని బాధలలో నుండగా ఆ తరుణమున 1897 జూన్ 22 వ తేదీన ఇండియాప్రభుత్వమువారు విక్టోరియారాణి షష్టిపూర్తి యుత్సవము చేయ తలపెట్టిరి. ఉత్సవమునాడు చాపేకారుసోదరులు ఇరువురు ఇంగ్లీషు ప్రభుత్వోద్యోగులను హత్య జేసిరి. వారిలో నొకడు ప్లేగుచర్యలు జరిగించిన "రాండ్" అను ఆంగ్లేయోద్యోగి. ఈ కాలమున కేసరిపత్రికలో, లోకమాన్యుడు వ్రాసిన వ్రాతలు తీవ్రరాజద్రోహమును పోత్సహించినవనియు, ఈ హత్యలకు కారణమైనవనియు, రాజద్రోహ