పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఎల్.ఎల్. బి. పరీక్షలో తేరి ప్రభుత్వోద్యోగమునుగాని న్యాయవాదవృత్తినిగాని స్వీకరింపక తన స్నేహితుడగు ఆగార్కార్ గారితో కలిసి పూనాలో ఒక పాఠశాల నేర్పరచిరి. విష్ణుచిప్లంకర్ గారుకూడా వీరితోకలిసి యా పాఠశాలను వృద్ధిచేసి 1880 లో పూనాలో నొక నూతనాంగ్ల పాఠశాలను స్థాపించిరి. వీరి కప్పుడు అప్టే, నామజోషీగార్లను వా రిరువురు తోడైరి. వీరందరు కలిసి కేసరి మహారాష్ట్ర పత్రికలను స్థాపించి దేశసేవ చేయసాగిరి. కొల్హాపూరు మహారాజును రీజంటు పరిభవించుటనుగూర్చి ఆ పత్రికలందు విమర్శింపగా వీరిపైన రాజద్రోహనేరము నారోపించిరి. చిప్లంకరుగారు చనిపోగా తిలకు - ఆగార్కారుగార్లు శిక్షింపబడిరి.

చెరసాలనుండి విముక్తులైనపిదప తిలకుగారును ఆగార్కారుగారును మఱల దేశోద్ధరణమునందే తమ కాల మెల్ల వినియోగింపసాగిరి. వీరు తమ యావజ్జీవము దేశసేవకొరకు వినియోగింపదలచి సుప్రసిద్ధ విద్యాభివృద్ధిసంఘమగు 'డెక్క౯ ఎడ్యుకేషనల్ సొసైటీ' ని 1884 లో స్థాపించిరి. దీనిలో జేరిన యావజ్జీవ సభ్యులు భారతదేశప్రజలకు విద్యాదానముజేయుచు దేశసేవజేయుటకు నెల 1కి 75 రూపాయిలుచొప్పున జీతముపైన పనిచేయుటకు దీక్షవహించి 1885లో తాము స్థాపించిన ఫెర్గుస౯ కాలేజీలో ఉపాధ్యాయులుగ పనిజేయుచుండిరి. వీరెల్లరి, దేశాభిమానమును స్వార్థత్యాగమునుజూచి 1884 లో బి. ఏ. , పరీక్షలో నుత్తీర్ణుడైన 18 సంవత్సరముల వయస్సుగల శ్రీ గోపాలకృష్ణ గోఖలేగారు ఆ చిన్న వయస్సులోనే