పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

327


వచ్చినది. అంతట వీరికి తీవ్రవిషాదమును రోషమును గలిగెను. ఈ విప్లవమును లేవదీసినందుకు అందరికిని తగుశాస్తి గావింపవలెనని క్రోధావేశముగలిగి దేశములో చిందులు ద్రొక్కుచు నిరాయుధులును నిరపరాధులును అగు స్త్రీపురుషులను పసిపిల్లలను దొరకినవారి నెల్లరను క్రూరముగా వధింపసాగిరి. తామేదో మహాయుద్ధమునకు తరలిపోవుచున్నట్లు సైన్యములను నలుప్రక్కలకు తీసికొనిపోయి ఇంక నెవ్వరో విప్లవకారులు మిగిలియున్నారని చెప్పుచు, వారి నణచు నెపమున పట్టణములను పల్లెలను భీభత్సము చేయసాగిరి. ఈసమయమున జరిగిన రక్తపాతము, ఘోరాన్యాయములు, క్రూరకృత్యములు, అసలు విప్లవమున జరిగినవాని కన్న వేయిమడుగు లధికముగా నుండెననియు, విప్లవసైన్యములు చేయని అనేక దుష్కృత్యములను ఆంగ్లేయులు చేసిరనియు ఆనాటి ఆంగ్లేయచరిత్ర కారులే ఒప్పుకొని యున్నారు. విప్లవమునందు భారతీయ సైనికులు స్త్రీలను అవమానించినారని వ్రాసిన వ్రాత లబద్దములని ఆంగ్లేయచరిత్రకారులే ఒప్పుకొన్నారు. ఆంగ్ల సైనికులు కనపడినవారి నెల్లరను చెట్లకొమ్మలకు వ్రేలాడదీసి చంపిరి. తుపాకులతో గాల్చిరి. స్త్రీలను జెఱచిరి., చిత్రవధలు గావించిరి. తమ యక్కసు నెల్ల దీర్పికొనిరి. నిజముగా విప్లవము అణగిపోయిన చాలకాలమువరకు వీరుదేశములో నిట్లు భీభత్సము గావించుచునేయుండిరి. ఎవ్వరైన నిష్పక్షపాతులగు నాంగ్లేయులు దీనినిగూర్చి మందలించినచో 'మీకు తెలియదు ఊరకొను' డనిరి. ఇంగ్లాండువారికి, తాము ఇంకనెంతో కష్టపడి విప్లవాగ్నిని