పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము

11


నాటికి 24000000 పౌనుల రొఖ్కమును ఇంకను బంగారు వెండి కడ్డీలును జవాహిరీయు మొగలు ఖజానాలో నిలువయుండెను. ఔరంగజేబు చనిపోవునాటి కెంత ఖర్చు అయిపోయినను నాదర్ షా ఢిల్లీ ప్రాంతమునుండి 1757 లో ఎంతసొమ్ము కొల్ల గొని తీసికొనిపోయిననుకూడ దేశ మింకను భాగ్యవంతముగనే యుండెను. నాడు దేశపరిపాలనము గూడ చాల కట్టుదిట్టముగ జరుగుచుండెను.

మొగలాయి చక్రవర్తియగు అక్బరు కాలమున నా సామ్రాజ్యము వివిధ సుభాలు (రాష్ట్రములు)గా విభజింపబడి ఒక్కొక్కసుభా కొక్కొక్క గవర్నరు నియమింపబడెను. ఇతని కా రాష్ట్రములో పూర్తియైన సివిలు మిలిటరీ అధికారము లన్నియు నుండెను. దేశములో ముందుగా భూములను కొలచి (పయిమాషీ) సర్వే చేయించి భూమిపైన యకరమున కింత పండినదని నిర్ణయించి దీనినిబట్టి శిస్తుతరము నిర్ణయింపబడెను. అక్బరుకాలమున మొదట నిది ప్రతిసాలున జరుపబడెను. తరువాత నిది 10 సంవత్సరముల కొకమారు జరుగు చుండెను. స్థానికజిల్లా రివిన్యూ వసూలు అధికారిని అమల్ గుజా రని వ్యవహరించిరి. ఈ అధికారికి బ్రిటిషు జిల్లాకలెక్టరు జిల్లా మేజస్ట్రీటుకుండిన పోలీసు నేరవిచారణ అధికారము లుండెను. ఈ యుద్యోగికి నేటి కలెక్టరుతో చాల పోలికలు గలవు. ఇతడు రైతు బాంధవుడుగ ప్రవర్తింపవలెనని ఉత్తరువు లుండెను. దురవస్థలోనున్న రైతులకు ఋణము లివ్వవలసిన బాధ్యతయు నితనికి కలదు. స్థానికబొక్కస మితని యధీన