పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

325

ఇట్లు సర్వమును సంసిద్ధముచేసికొని దేశములోని సిపాయిల పటాలములు తిరుగుబాటుచేయుటకు, విప్లవారంభమునకు, సుముహూర్తము నేర్పాటుచేసిరి. కాని మఱల ఏదో విఘాతముకలిగి సుముహూర్తమును మార్చిరి. ఇట్లు కొన్నిమారులు జరిగినది. ఈ ఆలోచనలు, సంచలనము వలన ప్రభుత్వాధికారులు మేల్కొని యుండవలసినదే గాని మీరతులో తిరుగుబాటు ప్రారంభమగువరకు నిది తిరుగుబాటని గ్రహింపలేదు. లక్నోలో వధలు జరుగువరకు నిది విప్లవమని గ్రహింపలేదు. ఆనా డారణరంగమున పాల్గొనినవా రిది నిజముగా విప్లవమని గ్రహింపలేక పోయి రనియే చరిత్రకారుడగు కర్నల్ మల్లెసన్ గారి యభిప్రాయము. నలుబదివేల ఆంగ్లేయదళములతోను కొన్ని నేటివు దళములతోను సిక్కుల సహాయముతో అణచివేయబడిన ఈ సిపాయిల విప్లవమును నిజముగా నొక స్వాతంత్ర్య యుద్దమనుటకు వీలులేదని తాంప్సన్ గెర్రాట్ గార్ల అభిప్రాయము.

ఈమహావిప్లవమున కేర్పరుపబడినదినము ముహూర్తము రాకమునుపే ఇది ప్రజ్వరిల్లినది. పందిక్రొవ్వు ఆవుక్రొవ్వు పూసిన తోటాలనిచ్చి తమ్ము మతభ్రష్టుల చేయదలచిరని తలచిన సిపాయిలలో నాకస్మికముగా నిప్పు ముట్టుకొనినది. వీరు అనుకొనిన ప్రకారము జరుగక ఆకస్మికముగ ఒక సిపాయిల పటాలములో నొక తిరుగుబాటు ప్రారంభమై వీరు పన్నిన విప్లవవ్యూహములెల్ల వృధలైపోయెను. దేశములోని వివిధశక్తులు భిన్నములై పోయి, సంస్థానాధీశులు ప్రజల విప్లవ