పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


విశేషకృషి చేయుచుండెను. ఈ బొంబాయిసంఘమునజేరి దేశముకొరకు పనిచేసినప్రముఖులలో సర్ మంగళదాస్ నాతూభాయి, నౌరోజీ ఫర్‌డూంజీగార్లు నిర్భయముగా భారతదేశ ప్రజాపక్షము వహించి వంగరాష్ట్రమున క్రిస్టోదాస్‌పాల్ వలెనే ప్రభుత్వచర్యలను విమర్శించుచు దేశోద్దరణకొరకు పాటుపడుచుండిరి. వీరు బొంబాయి మునిసిపలుసంఘము నందుగూడ విశేషకృషి చేసిరి.

V

ఆ కాలముననే మన చెన్నరాజధానిలోగూడ స్వధర్మ రక్షణకొరకును దేశోద్ధరణకొరకును మహత్తర కృషి జరిగెను. ఈఉద్యమమునకు నాయకులు ఆనాడు ప్రత్తి, నీలిమందువ్యాపారములలో లక్షాధికారియైన ఆంధ్రవర్తకుడగు గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు. ఆ కాలమున మద్రాసులో సుప్రసిద్ధ బ్యారిష్టరుగానుండిన ఆంగ్లవిద్యాధికుడగు జా౯ బ్రూస్ నార్టనుగారు వీరికి కుడిభుజమైయుండిరి. భారతదేశ నాగరకతను ధర్మమును రూపుమాపుటకు ఆనాడు క్రైస్తవమతాచార్యులును కంపెనీ ప్రభుత్వమువారును కలిసి పన్నుచున్న కుతంత్రములను, చేయుచున్న అన్యాయములను, ప్రతిఘటించి స్వధర్మమును సంరక్షించుటకును, దేశములో తీవ్రమైన ప్రజాభిప్రాయమును కలిగించి ఇంగ్లాండులోని కంపెనీ డైరక్టర్లకు తెలియపరచుటకును అందువలన లాభము లేకపోయినచో వారి పై యధికారులగు ఇంగ్లాండుప్రభుత్వ పార్లమెంటువారికి సైతము తెలియపరచుటకును ఎంతో కృషి చేయవలసి