పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


రోమునగర సామ్రాజ్యములో నా సామ్రాజ్యాధీశులు జయించిన వివిధజాతులనెట్లు వైజ్ఞానిక పారతంత్ర్యమున ముంచినారో ఆ ప్రకారమే నేడు భారతీయులను గూడ తమ దేశ వేష భాషల పైన అభిమానమును గలిగించి ఆంగ్లనాగరికతా వ్యామోహమున ముంచుటయే ప్రధానకర్తవ్యమనియు బయల్పరచినారు ఇట్లే వంగరాష్ట్రమున ఆంగ్లవిద్యాభివృద్ధి ప్రయత్నము జేసిన వారిలో నొకడగు రెవరెండు అలెగ్జాండర్ డఫ్‌గారును జెప్పియున్నారు. భారతదేశమునకు లా మెంబరుగాను లాకమిషనరు గాను వచ్చిన లార్డు మెకాలే ఈ విద్యావిధానముయొక్క పరమోద్దేశమును 1836 లో నిర్భయముగా నిట్లు చెప్పినాడు. “మన విద్యావిధాన మమలుజరిగినచో వంగరాష్ట్రమున ముప్పదేండ్లలో నొక్క విగ్రహ రాధకుడైనను మిగులడని నా విశ్వాసము.” ఈమహానుభావు డింతటితో నూరకొనలేదు. 1853 లో నిట్లు చెప్పినాడు. “ఇప్పుడు మనము ముఖ్యముగా చేయవలసిన కర్తవ్యము - మనము పరిపాలించు లక్షోపలక్షలజనములకును మనకును మధ్య నొకరిభాష నింకొకరికి తెలుపు ద్విభాషీలై, రక్తములోను రంగులోను భారతీయులై, జన్మమునమాత్రమే భారతీయులుగానున్నను రుచులలోను అభిప్రాయములందును నీతియందును విజ్ఞానమందును కేవలము ఆంగ్లేయులుగనే యుండు నొక తరగతివారిని సృజియించుటకు మన యావచ్చక్తిని వినియోగింపవలెను." ఇట్టి దురుద్దేశముతో ప్రారంభింపబడిన విద్యావిధాన విషవృక్షము ఫలించి దేశద్రోహులను తయారుజేయుటలో నాశ్చర్య మేమున్నది?