పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

260

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


చలాయించినది ఆంగ్లసైనిక శాసనధర్మము. ఆనాటి ఆంగ్లధర్మశాస్త్రమునం దనేక విపరీతపు పద్ధతులుండెను. ఎంతచిన్న వస్తువును దొంగిలించినను ఉరిశిక్షవేయుదురు. ఏదైన నొక పత్రమును ఫోర్జరీ చేసినను ఉరిశిక్షయే. దీనికికారణము ఆంగ్లేయులకు ఆస్తిపైనగలకాంక్షయె. సైనిక శాసనధర్మము వారి కివ్వబడక పూర్వము ఈ కంపెనీ వారు తమ దేశస్థులను స్వంత నౌకర్లను గూడ క్రూరశిక్షల పాల్జేయుచు చిత్రహింసలు వధలు జేయుచుండిరి. ఎవనినైన వదల్చుకొనవలె నన్నచో వానిని కొరడాలతో చావబాది చచ్చినపిదప ఈడ్చి వేయుచుండిరి. ఓడదొంగల నురిదీయుట కొసగబడిన అధికారమును పురస్కరించుకొని ఆ నేరమును అనేక సామాన్య వర్తకులపైన మోపి ఉరిదీయుచుండిరి. ఈ సంగతి నింగ్లీషుచరిత్రకారుడే వివరించినాడు. (చూడు: టారెన్సు, పుటలు 21-22)

ఆంగ్లేయ రాజ్యాధిపత్వమును గట్టిపరుపవలెనన్నచో నవాబులకు గల న్యాయవిచారణ అధికారమును దీసివేయుట యవసరమని వారన్ హేస్టింగ్సు గ్రహించెను. అందువలన నీతడు గవర్నరు కాగానే పూర్వమునుండియు న్యాయవిచారణ చేయుచుండిన గ్రామపంచాయతులకును నవాబుయొక్క అధికారులకును గల క్రిమినలు విచారణాధికారములను తొలగించి ఆంగ్లేయ కలెక్టర్లను నియమించినాడు. ఈ మార్పు సహజముగనే జరిగెను. దివానీగిరీ వచ్చినప్పటినుండియు పంచాయతీయొక్క అధికారములు తగ్గింపబడి కంపెనీయొక్క అధికారములు వృద్ధిచేయబడుచునే యుండెను.