పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


యొక్క నిజస్థితి నెరిగిన ధర్మాత్ములగు నాంగ్లేయు లనేకులు వ్రాసియున్నారు.

కరవులు వచ్చుటకుగల కారణములు ఆహార పదార్ధములు లేకపోవుటగాదనియు, నవి కొనుటకు రైతులకు శక్తి లేకపోవుటయే యనియు, వారి కేదైనా మిగిలి, జీవనాధారము కలిగియుండుట యనునది రైతులపైన విధింపబడు భూమిశిస్తు పయిసను వానిని వసూలుచేయు పద్ధతిపయినను నాధారపడి యుండుననియు కర్నల్ బైర్డు స్మిత్తు గారు వ్రాసియున్నారు. ఈయన 1861 లో వ్రాసిన రిపోర్టులో కాలువలు రోడ్లు మరియితర సాగుబడి మార్గములు లేకపోవుటకన్నను భూమిపన్నుల హెచ్చుతగ్గులతోనే ఈ కరవుల కెక్కువ సంబంధము కలదని వ్రాసినాడు. నిజముగా నీ భూమిపన్ను యింతహెచ్చుగా నిర్నయించుట, రైతు స్వతంత్రుడై తల ఎత్తుకొని తిరుగకుండా అణగి పడియుంచవలెననియే నని పూర్వము సివిల్ సర్వీసు యుద్యోగిగా నుండిన త్యాకరీ వ్రాసియున్నాడు. ఈసంగతినే సర్ శంకరన్ నాయర్ గారు కూడా చెప్పి యీ అత్యధిక భూమిపన్నునుగూర్చి విమర్శించియున్నారు. మద్రాసులో రైతువారీపద్దతి స్థాపించిన సర్ తామస్ మన్రో 1827 లో చనిపోయినపిదప కొన్నాళ్లలోనే రైతువారీ పద్దతిలోని లోపము లెల్ల తీవ్రతరము లయ్యెను. తరువాత 30 సంవత్సరములు, శిస్తు లిచ్చుకోలేక రైతులు బాధలుపడుటయు వారినుండి బలవంతముగా శిస్తులు వసూలు చేయుటకు రివిన్యూ ఉద్యోగు లతిక్రూరములయిన పద్దతు లవలంబించి వారిని పీడించుటయు