పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిస్తులనిర్ణయము - వసూలు

243


మక్తాయే యనియు, ఆర్థికముగా రాబట్ట తగినంత కట్టుబడిని రాబట్టుటకు తమకు హక్కుకలదనియు అదిన్యాయమే యనియు తలంచిరి. అందువలన నికరపంటలో వీలైనంత హెచ్చు భాగమును కట్టుబడిగా వసూలు చేయుటయే ఇంగ్లీషు దొరతనమున 1857 వ సంవత్సరపు శిపాయివిప్లవమునకుపూర్వ మవలంబింపబడిన శిస్తుల పద్దతిలోని నీతిగా నుండెను. వంగరాష్ట్రమున శిస్తులువసూలు చేయుహక్కులను వేలము వేసినప్పుడును, జమీందారులకు భూములందు హక్కులు స్థిరపరచి శాశ్వత శిస్తును పేష్కస్ గా నిర్ణయించినప్పుడును, మద్రాసులోను బొంబాయిలోను రైతులకే భూమిహక్కులిచ్చి వారి వద్దనుండి తిన్నగా శిస్తులు వసూలు చేయుటలోను గూడ కంపెనీవా రీ నీతినే పాటించిరి.

భూసంపదవిషయమునను పంటసమృద్ధి విషయమునను నేటికన్న నూటఏబదియేండ్లక్రిందట రైతులెక్కువ మంచిస్థితిలో నుండినందుకు చాల నిదర్శనములు కలవనియు, 1857 నాటికే వీరిస్థితి పాడుకాజొచ్చెననియు, అయితే ఈ దుస్థితికి బ్రిటిషు పరిపాలనమే కారణము కాదనియు, 'తాంప్సన్ గెర్రాట్టు' గార్లు వ్రాసిన బ్రిటిషుపరిపాలన చరిత్రలో చెప్పుచున్నారు. 1750 కిని 1850 కిని మధ్య భారతదేశమున జనసంఖ్య చాల హెచ్చినది. డాల్ హౌసీ కాలము (1848) వరకునుగూడా పల్లపు వ్యవసాయమునకు వలసిన పెద్దకాలువలుగాని ఆనకట్టలుగాని నిర్మింపబడలేదు. ఆ కాలములో గ్రామవృత్తులందుండు వారును గ్రామనౌకరులును వ్యవసాయమునందుకన్న పైనిక సేవయందే