పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మరణించుటతో 1707 మొదలు వీరిచరిత్రలో నూతన యుగము ప్రారంభమయ్యెను. కేవలము వర్తకులుగనుండి బహు వినయ విధేయతలతో రాజుల నాశ్రయించిన వర్తకులు బలవంతులై దేశములోని రాజుల పోరాటములందు తాముగూడ కల్పించుకొని రణరంగమున బ్రవేశింపసాగిరి. కయ్యమునకు కాలు ద్రవ్వుచు ధనలాభము, రాజ్యములో పలుకుబడియుకూడా పొందుట ప్రారంభించిరి. ఇట్లేబదేండ్లలో వీరమితధనమును, పెక్కు జాగీరులను సంపాదించిరి. మొగలుచక్రవర్తి పైన పలుకుబడిసంపాదించి, అతనిని వంచించి బంగాళము, బీహారు, ఒరిస్సాలలో పన్నులు వసూలుచేయు దివానీగిరి హక్కును 1765 లో పొందిరి.

II

దివానీగిరి దొరతనము.

12 న ఆగస్టు 1765వ తేదీనాటి కింకను నామమాత్రావశిష్ఠుడైయున్న మొగలాయి సామ్రాజ్య చక్రవర్తియగు షా ఆలంవల్ల తూర్పుఇండియా వర్తకసంఘమువా రొక ఫర్మానానుపొంది వంగరాష్ట్రమునను బీహారు ఒరిస్సాలలోను పన్నులు వసూలు, సివిలు పరిపాలన అధికారమును సంపాదించిరి. నాటి కింకను వంగరాష్ట్ర నవాబులు పేరునకు ఢిల్లీ చక్రవర్తి యొక్క రాజ ప్రతినిధులేగాని బలవంతులగు ఇంగ్లీషువారి చేతిలో వారు కీలుబొమ్మలు. మొగలు చక్రవర్తి వలన కంపెనీవారు సులభముగా నొక ఫర్మానాను సంపాదించిరి. ఈ కంపెనీవారు తనకు జేసిన అనేక 'ఉపకారము'