పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగ నిర్మాణము

217


పరిపాలక వర్గమును నిర్మించిరి. ఒక్కొక్క చోట నొక్కొక ప్రెసిడెంటు లేక గవర్నరు నితనితో కలిసి ఆఫ్యాక్టరీ వ్యవహారములు నిర్వహించుట కొక కౌన్సిలు లేక కార్యాలోచన సభయు నిర్మింపబడెను. ఈ సభలలో అనుభవజ్ఞులగు కంపెనీ యుద్యోగులు నియమింపబడిరి. అన్ని పనులును మెజారిటీ అభిప్రాయము ప్రకారము నిర్వహింపబడునట్లు కట్టడిచేసిరి.

ఈ ప్రెసిడెంట్లను బట్టియే యీ మూడుప్రదేశములకు ప్రెసిడెన్సీ లేక రాజధాని అని పేరు వచ్చెను. ఈ రాజధాను లొకదాని కొకటి లోబడియుండలేదు. కంపెనీ యుద్యోగులు, రైటర్లు, ఫ్యాక్టర్లు, సీనియర్ ఫ్యాక్టర్లు, మర్చెంట్సు అను తరగతులవారుగా విభజింపబడిరి. సీనియారిటీ వల్ల నే ప్రమోషను లివ్వబడుచుండెను. వీరికి చాలా స్వల్పజీతము లుండెను. ప్రయివేటు (స్వంత) వర్తకము చేసుకొనవచ్చును. కంపెనీ నౌకర్లుచేయు నేరములను విచారణచేసి శిక్షించుట అవసరముకాగా కంపెనీవారు అప్పటి ఇంగ్లాండు రాజగు జేమ్సు వల్ల 1623 లో ప్రెసిడెంట్లకును ఇతర ముఖ్యాధికారులకును క్రిమినల్ విచారణాధికారము నిచ్చుటకు పట్టాపొందిరి. తరువాత 1661 లో నీ కంపెనీవారు పొందిన సన్నదువలన మరికొన్ని అధికారములను వీరు సంపాదించిరి. వీరికి పోటీగా భారతదేశ సముద్రతీరములందు వ్యాపారము చేయుటకువచ్చినవారి ఓడలను పట్టుకొను అధికారమును పొందిరి.

కంపెనీవారు సముద్రముపైన తమ నౌకలందువలెనే మొగలాయిరాజ్యమునగల భూమిపైనకూడా తమకంపెనీ నౌక