పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


లేదు. వీరుకూడా బ్రిటిష్ ప్రభుత్వమును గట్టిపరచినవారే. కొన్నాళ్ళు మద్రాసుగవర్నరు పనిజేసి ఎంతో మంచివాడనియు ఉదారుడనియు పేరుపొందిన సర్‌తామస్‌మన్రోకూడ సామ్రాజ్య తత్వమునందు ఇతర ఆంగ్లేయ రాజ్యతంత్రజ్ఞులకు తీసికట్టు కాడు. ఈ సంగతి ముఖ్య సైనికాధికారిగా నితడు 1790 లో సీమకు వ్రాసిన రహస్యపు లుత్తరమువలన తెలియగలదు. "దేశీయరాజులకు మధ్య రాజ్యాధికారమును పంచియుంచుటకు మన మిప్పు డవలంబించుచున్న పద్దతి యెంత మాత్రము బాగుగలేదు. వీరి నందరిని జయించి ఆరాజ్యధికారమునంతను మనమే కాజేయుట యనున దొక్కటే సరియగు రాజనీతి మార్గము, సరియైన పద్ధతి. ఈపద్దతి వలన మన కిప్పుడు వచ్చుచున్నదానికంటే మూడు రెట్లు రివిన్యూ అవలీలగ రాగలదు. ఆ రాజ్యాధికారము నంతను మనమిప్పుడే ఒక్కసారిగనే దిగమ్రింగవలెనని నాయుద్దేశము కాదు; ఏలననగా అది యిప్పుడు మనకు సాధ్యముకాదు. నేను చెప్పునది యేమనగా ఈపరమలక్ష్యమును మాత్రము మనము మరచిపోకుండా నదా మన దృష్టియం దుంచుకొని మనము మెలుకువతో పనిచేయవలసియుండును. ఈ సంకల్పసిద్ది నెరవేరుటకు చాల సంవత్సరములు పట్టునను సంగతి నాకును తెలియును. అయినను దానిని మన దృష్టినుండిమాత్రము జారిపోనీయకూడదు. మన మెప్పుడు రంగములోనికి రావలెనో దేశీయరాజుల అంతః కలహములే మనకు తప్పక చెప్పును. కాని టిప్పు ఉన్నంతవరకు మాత్రము మనకు ఆ సుముహూ