పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లైవు చూపినదారి

155


ఇదిగాక కంపెనీవారు దక్షిణమునజేసిన యుద్ధఖర్చులక్రింద 50 లక్షల రూపాయలిచ్చుటకిత డొడంబడెను. ఈసమయమున నితడు కంపెనీ నౌఖరులకు బహుమతులపేరున నిచ్చిన లంచముల విలువ 200269 పౌనులు. దీనిలో 58333 పౌనులు గవర్నరే పుచ్చుకొనెను.[1]

మీర్ఖాసీ మెంతో కష్టపడి తానుచేసిన వాగ్దానముల నెల్ల రెండేండ్లలోనే చెల్లించెను.

II

అన్యాయపు వ్యాపారము : ప్రజాపీడనము.

మీర్ఖాసీము మీర్జాఫరుకన్న సమర్థుడగు పరిపాలకుడు. ఇతడు ప్రజల స్థితిని బాగుచేయ ప్రయత్నించెను. గాని సత్పరిపాలన జేయుట కీ మీర్ఖాసీమున కవకాశ మెవరిత్తురు? కలకత్తాలో కంపెనీవారి కౌన్సిలులోని అధికసంఖ్యాకుల కితనిపై అనుమానము. మీర్జాఫరువలె నితడు తమ మాట వినుటలేదని కోపము. ఇందువలన తమ రహస్యలాభములు తగ్గుచున్నవని రోషము. ముఖ్యముగా నీ పెద్ద యధికారుల లాభము నిమిత్తము భారతీయ గుమాస్తాలు చేయుచుండిన వ్యాపారముపైన అతడు ఘాటీనుంకములు విధించుటవలన వీరికి కంటకమయ్యెను.

  1. ఈ మహత్కార్యము గావించినందుకు కౌన్సిలు అధ్యక్షుడగు వాన్సిటార్టుకు 58333 పౌనులు తక్కిన సభ్యులలో హాల్వెలుకు 30937 పౌనులు గమ్నరుకు 28000 కెయివాడుకు 22916 యింకను చిల్లర యుద్యోగుల కితర మొత్తములను మీర్ఖాసీము లంచములుగానిచ్చెను.