పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మీర్జాఫరు అల్లుడు మీర్ఖాసీం క్రొత్తనవాబు మొగలుచక్రవర్తితో కలసి ఆంగ్లేయుల ప్రాబల్యమును గూలద్రోయ ప్రయత్నించెను. గాని లాభము లేకపోయినది. దీని ఫలితముగా 1765 లో క్లైవు, చక్రవర్తి వలన వంగరాష్ట్ర బీహారు ఒరిస్సాల దివానీగిరీని కంపెనీకి సంపాదించి ఫర్మానా పొందగల్గెను. ఇట్లే కర్ణాటకమునకు దక్షిణ హిందూస్థానమునకు గూడ ఒక ఫర్మానాను పొందెను. ఇది బ్రిటిషు సామ్రాజ్యస్థాపనకు ప్రథమ సోపానము. వంగరాష్ట్ర నవాబుగద్దెపై నొక కీలుబొమ్మను నిలిపి తన యిచ్చవచ్చిన ట్లాడించుటవలన కంపెనీవారికి ఉత్తర హిందూస్థానమున గొప్ప పలుకుబడి యేర్పడెను.

మీర్జాఫరుతో సంధిజరిగిన మూడుసంవత్సరములలోనే ఆంగ్లేయదొరల కతనిపైన దయతప్పినది. అతనికాలమున కంపెనీనౌకరు లెల్లరు తామే దేశాధికారులుగ బ్రవర్తించి వంగరాష్ట్రము నల్లకల్లోలముజేసి అరాజకమున ముంచిరి. మీర్జాఫరు పనికిమాలినవాడని అతనిని త్రోసి రాజని అతని అల్లుడగు మిర్ఖాసీమును సింహాసనమెక్కించి అందుకు ప్రతిఫలముగా అతనివల్ల సైనిక వ్యయముక్రింద రెండులక్షల నవరసులును, బర్డువాను, మిడ్నపూరు, చిటగాంగు, జిల్లాలను పుచ్చుకొనిరి. అతని అధికారులను ధిక్కరించి దౌర్జన్యముచేసి కంపెనీసేవకులెల్లరు కంపెనీసరకులనేగాక తమ స్వంతసరకులకు గూడ పన్నులు లేకుండా వ్యాపారలాభములు పొందు చుండినందున అతని ఆదాయము తగ్గిపోయెను. మీర్జాఫరు ఇవ్వ వలసిన బాకీని మీర్ఖాసీము చెల్లించుట కంగీకరింపవలసివచ్చెను.