పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు వర్తకసంఘము

139


భరతఖండము నేలుచుండిన జగద్విఖ్యాత మొగలాయి చక్రవర్తి యగు జహంగీరునకు తనదేశపు వర్తకులకు తావిచ్చి రక్షింపవలసినదని లేఖను వ్రాయగ జహంగీరు వారిని సూరతుకాంబే అహమ్మదాబాదులలో నెలకొననిచ్చి 1613 లో ఫర్మానా జారీ చేసెను. ఆ కాలమున భారతదేశమున ప్రపంచములోనికెల్లను విశాలమైన మహా సామ్రాజ్యము వర్ధిల్లుచుండెనని జె. బ్రూస్ అను నతడు వ్రాసియున్నాడు. [1] ఆంగ్లేయ తూర్పుఇండియా కంపెనీవారు ముడిపట్టు, 'కాలికో' వస్త్రములు, నీలిమందు, లవంగములు, జాపత్రియు మన దేశమునుండి ఐరోపా కెగుమతి చేసి వాని ఖరీదుక్రింద బంగారునే ఈ దేశములోనికి తెచ్చి యిచ్చుచుండిరి. ఈ వ్యాపారము వారి కమిత లాభకారిగ నుండెను. వర్తక మారంభించినది మొదలు ఎనుబది వత్సరములు వారికి సాలుకు నూటికి 171 వంతుల చొప్పున లాభము వచ్చుచుండెను. కంపెనీ స్థాపింపబడిన నాలుగేండ్లకు వారికి లాభములు నూటికి 87 1/2 వంతులు మాత్రమే వచ్చుచుండెనని వా రెంతో వగచిరి.

1615 లో నాంగ్లేయరాజగు మొదటి జేమ్సుదగ్గరనుండి జహంగీరు చక్రవర్తిదగ్గరకు సర్ తామస్ రో అను రాయబారివచ్చి మూడుసంవత్సరము లిచ్చట నుండెను. ఆంగ్లేయ వర్తకులకు ఆశ్రయ మివ్వ వలసినదని ఆశ్రయించెను. దీని ఫలితముగా నీ యాంగ్లేయులు తన మొగలు సామ్రాజ్యములో

  1. (Annals of the East India Co. - J. Bruce quoted by James Mill in his History of India)