పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

57


మడివాలు మాచయ్య (పు. 100)

ఈతడు చాఁకలి. మహిమగల భక్తుఁడు. ఈతఁడు శివభక్తుల మడుఁగుల నుదికి తెచ్చునప్పుడు భవు లడ్డు రాఁగూడదు. వచ్చెనేని చంపును. ఒకనాఁడొక బాటసారి యడ్డురాఁగా వానిని జంపెను. బిజ్జలుఁ డందుకుఁ గోపించి యీతనిఁ జంపుటకై యేనుఁగును బంపెను. దానినిగూడ నీతఁడు చంపెను. బసవన తెలుపఁగ బిజ్జలుఁ డీతని మాహాత్మ్యమును విని యచ్చెరువంది యీతనికి శరణాగతుఁడయ్యెను. ఈతఁడు చచ్చిన మనుజుని, నేనుఁగును మరల బ్రదికించెను.

ఈతఁడు కాలజ్ఞానవచనములను, ఇతరవచనములను రచియించి నట్లు కన్నడకవిచరిత చెప్పుచున్నది. సాధారణముగా నాకాలపు వీరశైవులందఱపేర “కాలజ్ఞాన” మని యేదేదో భవిష్యద్విషయముఁ జెప్పునవిగా గొన్నిగ్రంథములు కన్నడమునఁగలవు. అవియెల్లను వారువారు రచియించినవే యనుటను గూర్చి నేను సంశయించుచున్నాఁడను.

అల్లమప్రభువు (పు. 36)

బసవపురాణ మీతని నతిలోకచరిత్రునిఁగాఁ జెప్పుచున్నది. కర్ణాటకవిచరిత్రమున నీ మహనీయుని చరిత్ర మిట్లు వ్రాయఁబడినది.

“ఈతఁడు శూన్యసంపాదనము, మంత్రమాహాత్మ్యము, షట్‌స్థలవచనములు, మంత్రగోప్యపదములు, సృష్టివచనములు, బెడగినవచనములు, (ప్రభు దేవర) కందములు, కాలజ్ఞానవచనములు నను గ్రంథముల రచియించెను.

ఈతఁడు వీరశైవగురువులందు బహుప్రఖ్యాతుఁడు. “శ్రీమద్దేశికషట్ స్థలచక్రవర్తి, బ్రహ్మానంద, పరమశివమూర్తి, విరక్తశిఖామణి, మాయాకోలాహల ప్రభుదేవుఁ”డని శైవగ్రంథకర్త లీతనిఁ బేర్కొనిరి. ఈయన విషయమునఁ బ్రభులింగలీలలు, అల్లమప్రభు సంగీతపదములు మొదలగు గ్రంథములు పుట్టినవి.

ఈతఁడు శ్రీశైలమున నరఁటిచెట్టులో శివైక్యమందె నన్నవార్త వినియే బసవేశ్వరుఁడు కూడలి సంగమేశ్వరునిలోఁ జేరెనని (కన్నడ) చెన్నబసవపురాణమునఁ గలదట.