పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

51


నవనిలోఁ జాళుక్యులను పేరు హరుని
కవిలెను దుడిపించి కల్యాణకటక
మీడితభక్తి మహిష్ఠతపేర్మిఁ
బాడుగా శపియించె బసవనమంత్రి

- పండితారాధ్యచరిత్ర

ఈ వ్రాఁత ప్రామాదికము. బిజ్జలుఁడు చాళుక్యుఁడు గాఁడు. కలచుర్యులు వేఱు. చాళుక్యులు వేఱు. చాళుక్యులను గొట్టి వచ్చినవాఁ డీబిజ్జలుఁడు కలచుర్యుఁడు.

బసవేశ్వరుఁడు కప్పడి సంగమేశ్వరునకు భక్తుఁడనియుఁ, దుది కాతఁ డాకప్పడి (కూడలి) సంగమేశ్వరమునకే యేఁగి యాదేవునితో నైక్యమందె ననియు, బసవపురాణమునఁ గలదుగదా! కర్ణాటకదేశమున సంగమేశ్వరక్షేత్రములు రెండు గలవట! సర్ వాల్టరు ఇలియట్ దొరగారు, బిజాపూరు జిల్లా హన్గొండ తాలూకాలో కృష్ణామలాపహానదులు సంగమించు స్థలమునఁ గల సంగమేశ్వరమే బసవేశ్వరుఁడు లింగైక్యమందిన స్థలమనియుఁ దత్రత్యులక్కడి సంగమేశ్వర లింగమునకు నడుమ నొకగుంటను జూపుచు నది బసవేశ్వరుఁడు లింగములోనికి దూరినచోటి చిహ్నమని చెప్పుదురనియు, వ్రాసిరి. ప్లీటుదొరగా రీవిషయమును గూర్చి సందేహించిరి. బసవపురాణమునఁ గూడలి (కప్పడి) సంగమేశ్వరమే పేర్కొనఁబడినది గావున, కృష్ణా తుంగభద్రానదుల సంగమస్థలమునఁగల సంగమేశ్వరమునకే పయిపేరు గలదు గావున, బసవేశ్వరుఁడు లింగైక్యమందిన స్థలముగాఁ దలఁపఁబడినది యిదియే యగునేమో యని వారు వ్రాసిరి. కూడలి సంగమేశ్వరమనికాని, కప్పడి సంగమేశ్వరమనికాని కృష్ణామలప్రభానదుల సంగమస్థలమునకుఁ బేరులేకుండుట నిశ్చితమే యగునేని, కృష్ణా తుంగభద్రానదుల సంగమస్థలమే బసవేశ్వరుఁడు లింగైక్యమందినస్థలమని నిశ్చయింపవలయును.

బిజ్జలుని చరిత్రము

బసవపురాణాదులను విడిచి శాసనాదులను గొని యీతని చరిత్రమును దెలిసికొందము.