పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

బసవపురాణము

పయి రెండు చరణములందును 'సల' ముగా నుండవలసిన ద్వితీయగణములలో 'త్య' 'భ' లు గురువులుగా నగుటచే గణభంగ మేర్పడుచున్నది. అన్ని ప్రతులందును నీ పాఠములే కలవు. వీనిని సమర్ధించుట యెట్లో!

ద్విపదమునఁ బ్రాసయతిని జేర్చుట, రేఫద్వయసాంకర్యము నంగీకరించుట మొదలుగా సోమనాథుఁడు చూపిన ఛందస్స్వాతంత్ర్యమును శివకవు లంగీకరించిరిగాని, యితరులు గర్హించిరి. కాకతి ప్రతాపరుద్రుని కాలముననే యిట్టి గర్హ మేర్పడినట్లు పద్యబసవపురాణము తెలుపుచున్నది. అర్వాచీనుఁడగు నొక శివకవి యిట్లు చెప్పినాఁడు :

...................................................
ఇలఁబాలకురికి సోమేశుండు మున్ను
తొలఁగక ప్రాసయతుల్ ద్విపదలను
లలి రచించుట యది లక్ష్యంబుగాను
నెలమి రేఫఱకారములు శివకావ్య
ముల యందుఁ జెల్లుఁ దప్పులు గావు గాన
ఆ పాల్కురికి సోముననుమతి నేను
దీపిత ప్రాసయతిచ్ఛందసరణి
నా మహాగురు దేవు ననుమతియట్ల
శ్రీ మెఱయంగ రచించితినిట్లు.

-మఱి బసవపురాణము.

ఛందోవిషయముననేకాక వ్యాకరణవిషయమునఁగూడ నన్నిచోడ సోమనాథాదులగు శివకవులకును నితరులకును బహుభేదములు గలవు. నన్నిచోడనియు, సోమనాథునియు శబ్దప్రయోగములు గొన్ని యసాధారణములై యితర కవికృతులందుఁ గానరానివై యున్నవి. అట్టివానిని గొన్నింటిని బేర్కొనుచున్నాఁడను.