పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

115

ఈ పద్యము నాల్గవ చరణమున 'కూఁతు' పదము 'కాంత' పదము ప్రాస యతిలోఁ జేర్పఁబడినవి. ఇందుఁ 'గూఁతు' పద మర్ధబిందు విశిష్టముగా నెన్నఁబడవలసినదే. అది పూర్ణబిందూచ్చారణముతో నుండవలసినదే యగునేని శాసనమున "కూంత్తు” అని చెక్కింపఁబడియుండును.

వేములవాడ భీమకవి నృసింహపురాణములోనిదిగా నీక్రింది పద్యము లక్షణ గ్రంథములందుఁ గలదు.

ఉ. వాఁడిమి నల్లసిద్ది జనవల్లభుఁడోర్చిన రాజుభీతితో
     నాండ్రను గావకుండ వృషభాంకము వెట్టికొనంగఁజూచితో
     నేఁడిది యేమి నీవనుచు నెచ్చెలులెల్ల హసింప నంతలో
     మూఁడవకంటితోడి దొరమూర్తి వహించిన మ్రొక్కిరంగనల్

ఇందు రెండవ చరణమున 'ఆఁడుర' అని కాని, 'ఆండుర' అని కాని, యుండునేమోయని నా సంశయము. ఆండ్రురు, నీళ్లులు ఇత్యాది విధముల బహువచనప్రత్యయములపై మరలఁ బహువచనప్రత్యయములు గల రూపములు భారతాదులలో నేఁడు గానవచ్చుచున్నవి. అవి యట్టివి కాకపోవచ్చునని 'ఆఁడురు, నీళులు' ఇత్యాది విధములనే యుండియుండవచ్చు నని నా తలఁపు. 'వెలయాండ్రురకలుపు' అనుచో 'వెలయాఁడురకలుపు' అని కాని, లేక 'వెలయాండురకలుపు' అనికాని, యుండవచ్చును.

కవిజనాశ్రయమునఁగూడ 'ప్రగీతి' లక్షణములో 'మూఁడుసేసి నగణములు, రెండు నలములు, మూఁడిన గణములును మొగినహంబు, పోఁడిగాఁ గనర్థమునకగు మీఁద ని,ట్లుండఁ జెప్పవలయు నొగిఁబ్రగీతి' అని కలదు. అదియు పూర్ణార్ధబిందుప్రాసమే.

మఱియు నీతఁడు పూర్ణార్ధబిందుప్రాసమును రేఫద్వయప్రాసమును గూడఁ గూర్చినాఁడు.

జగతిఁ బద్మపురాణసంహితలందె
సఁగె శంభురాఘవసంవాదమునను

- పండితా