పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

109


ద్విపదకు ద్విపదకుఁదెగఁజెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితరభాషలను
యతుల లోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులుఁ జెల్లును ప్రయోగానుసారమున
ద్విపదతో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు ప్రయోగింప నది యయుక్తంబు
మఱియు సంస్కృతపు సమాసరూపమున
నెఱయ నెన్నిటినైన నిర్మింపఁదగును
..........................................................
అనులక్షణమ్ముల ననువొంది సుకవి
జన సుప్రయోగైక శరణమై......

- అష్టమహిషీకళ్యాణము.

రంగనాథరామాయణాదు లీలక్షణము ననువర్తించుచున్నవి. కాని, సోమనాథుని రచన మిట్లు లేదు. ద్విపదమున నితరకవులెవ్వరును బాటింపని ప్రాసయతి నీతఁడు చేర్చెను. రంగనాథరామాయణమునఁగాని, గౌరన హరిశ్చంద్రచరిత్రమునఁగాని, ప్రాసయతి యెక్కడను గానరాదు. ఈతఁడును నీతని కనుయాయులగు శివకవులు మఱికొందఱును మాత్రమే యీ ద్విపద ప్రాసయతిని జేర్చిరి. 'అనియతగణైః' 'ప్రాసోవా 'యతిర్వా' యని మూఁడు సంస్కృతసూత్రముల నుదాహరించి సోమనాథుఁడు మాత్రాగణఘటితములగు జాతులందుఁ బ్రాసయతి చెల్లునని నిర్ణయము చేసినాఁడు. ఈ నిర్ణయము సంగతమే యనఁ దగియున్నది. అయినను రంగనాథాదులు దీని నంగీకరింపమికి హేతువేమో: మఱియు ద్విపదయు ద్విపదయుఁ గలయునప్పు డొక్కపదమే యిటు గొంతయు నటు గొంతయునై యుండునట్లు రంగనాథాదులెక్కడను గూర్పరయిరి. 'ద్విపదతో ద్విపద సంధిల నేకశబ్ద-మపుడు ప్రయోగింప నది యయుక్తంబు' అని చిన్నన్న స్పష్టముగా నీ విషయమును నిరూపించినాఁడు. అయినను మన సోమనాథుఁ డీ నిర్ణయమును బాటింపలేదు.