పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

103


దేశిరచన

తెలుఁగునకుఁ దోడిభాషయగు ద్రవిడభాషలో దేశిరచన లెక్కువగా నెక్కొన్నవి. ద్రవిడదేశీయులగు జైనులయు, శైవులయు, వైష్ణవులయు దేశిచరిత్రములు ద్రవిడభాషాసహజములగు దేశవృత్తములలో సంస్కృతసంపర్క మంతగా లేని ద్రవిడదేశిభాషలో రచితములై వెలసియున్నవి. కర్ణాటకమున నంతగా నట్టిరచనములు లేవుగాని తెలుఁగున కంటెఁ గొంత హెచ్చుగా నున్న వనవచ్చును. ఆదికాలమునఁ దెలుఁగుగ్రంథములు ప్రాయికముగా సంస్కృతభాషలో నున్న పురాణాద్యార్యగ్రంథముల కనువాదములుగానే వెలయుటచే నాంధ్రసహజములయిన దేశిరచనముల కాదరువు సన్నగిల్లెను. మన పూర్వులు పౌరాణికములయిన యార్యకథలమీఁదను, సంసృతచ్ఛందస్సుమీఁదను సంస్కృతప్రాయమయిన తత్సమభాషమీఁదను నభిమానము గలవారయి దేశీయేతివృత్తములను, దేశీయచ్చందస్సులను, దేశభాషను జిదుకఁద్రొక్కిరి. నేఁడు మనము స్త్రీపామరాదుల గేయరచనములని యనాదరమునఁ జూచు పదరచనము వరుసలే ద్రవిడభాషలోని ప్రౌఢకావ్యములందలి వృత్తములుగా నెలకొన్నవి. తరువోజ, ద్విపద, రగడ, అక్కర, గీతి, సీసము మొదలగు పరిమితజాతులే దేశిచ్ఛందోజనితములు మన గ్రంథములం దాదృతములయ్యెను. ఈ దోషముచే మన తెలుఁగుప్రబంధములం దాంధ్రతాముద్ర యంతగాఁ గానరాకున్నది. కొంతవఱ కాంధ్రతాముద్ర నచ్చొత్తి ప్రబంధముల రచించినవారిలో నగ్రగణ్యుఁ డీ సోమనాథ కవియే. ఈతఁడు దేశీయకథలను దేశిచ్ఛందోజనితమగు ద్విపదమున దేసితెనుఁగుబాసలో రచించినవాఁ డగుటచే నీతని కవితలో నాంధ్రతాముద్ర సక్కఁగా నత్తికొనెను. ఈతఁడు తన కవితారచనము నిట్లు ప్రశంసించుకొన్నాఁడు.

...............................................
సత్కృతియన నూత్నసంగతి దనరఁ
దొమ్మిదిరసములు దొలఁకాడ వాని
యిమ్మడి వర్ణన లెసఁగఁ దద్‌ద్విగుణ