పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

101


వర్ణన మఱి గణవర్ణనపదము
లర్ణవఘోషణ ఘూర్ణిల్లుచుండఁ
బాడుచు నాడుచుఁ బరమహర్షమున
...............................................................

-పండితారాధ్య చరిత్రము.

పయివానిలోఁ బెక్కులు సంస్కృతగ్రంథములు. శివతత్త్వసారము తెల్గుకృతి. శతకము, దీపకళిక మొదలగునవికూడఁ దెల్గుకృతులు గావచ్చును. ఆనందగీతములు, శంకరగీతములు, తుమ్మెదపదములు, ప్రభాతపదములు మొదలగు గేయరచనలుగూడ తెల్గువే. కాని యవి మన కిప్పుడు దుర్లభములుగా నున్నవి. దీనినిబట్టి చూడఁగా నీ శివకవుల తెలుఁగు కృతులు, పద్యరచనము గలవి, మల్లికార్జున పండితారాధ్యుని కాలమునకంటెఁ బూర్వము లేవేమో యని సంశయము కలుగుచున్నది. ఉన్నచో సోమనాథుఁడు పేర్కొనియుండును గదా! శివకవుల రచనారీతులను బరిశోధింపఁగా వీరి గ్రంథములకును, నన్నియాదు లగు (భవి)కవుల గ్రంథములకును బెక్కుభేదములు గానవచ్చుచున్నవి. అవి ముందు వివరింతును:

జానుఁదెనుఁగు

శివకవులు పలువురు జానుఁదెనుఁగును బ్రశంసించిరి :

చ. సరళముగాఁగ భావములు జానుఁదెనుంగున నింపుపెంపుతోఁ
    బిరిగొన వర్ణనల్ ఫణితి వేర్కొన నర్థము లొత్తగిల్ల బం
    ధురముగఁ బ్రాణముల్ మధుమృదుత్వరసంబునఁ గందళింప న
    క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణరసాయనలీలఁ గ్రాలఁగాన్.

- నన్నిచోడుఁడు.



ఉరుతరగద్యపద్యోక్తులకంటె
సరసమై పరగిన జానుఁదెనుంగు