పుట:నృసింహపురాణము.pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

57


డభినవపీతాంబరావృతదేహుండు భూదేవుఁ డొక్కఁ డపూర్వలీలఁ
జనుదెంచి ననుఁ జూచి సస్మితనదనుఁడై తనచేత నొప్పుసంతానఫలము


ఆ.

నాకు నిచ్చి మున్ను నా మెడనున్నహా, రంబు నిజనఖాంకురములఁ దిగిచి
కొనుచు వేగ చనియె నని రాత్రి నేఁ గల,గంటి నపుడు మేలుకొంటి ననఘ.

123


వ.

వీనిఫలం బెయ్యది యానతీయవలయు ననినఁ గావ్యుఁడు కొండొక దలపోసి నిశ్చ
యించి యద్దైత్యరాజమహిషి కి ట్లనియె.

124


ఉ.

ఆధరణీసురోత్తముఁ డనాది యనంతుఁ డనంగ నొప్పుల
క్ష్మీధవుఁ డచ్యుతుం డతఁడు మేకొని నీకును బుత్రు నిచ్చె స
ద్బోధసమగ్రుఁడై పరఁగుఫుణ్యుని నింతట సంతసిల్లు మే
లాధృతిదూలఁ బో మదిఁ దలంపఁగ మీఁదిశుభాశుభస్థితుల్.

125


ఉ.

చీరికిఁ గైకొనం డసురసింహుఁడు దుర్వహగర్వబుద్ధి నె
వ్వారిని వారిజోదరు నవార్యభుజు న్మధుకైటభారిజం
భారిపురస్సరామరగణైకశరణ్యు వరేణ్యభక్తిని
స్తారకుఁ బేరుకొన్న మది సైపఁడు మేలిట యెట్లు గల్లెడున్.

126


క.

నీమగనితేజమున ను, ద్దామశమసమగ్రుఁ డనఁగఁ దగి కుంపటిలోఁ
దామర మొలచినక్రియఁ ద, న్వీ మునివిభుఁ డైనసుతుఁడు నీ కుదయించున్.

127


క.

నీ వైనను మనమున జగ, దావాసుని వాసుదేవు నవ్యయు నెపుడున్
భావింపుము దుర్గతులం, బోవరు తద్భక్తజనులు పుణ్యవిచారా.

128


వ.

అట్లైనఁ బురంధ్రరత్నంబనైన నీకతంబున నసురవంశంబు విధ్వంసంబు నొందక
నిర్వహణంబు పడయునని భార్గవుఁడు చెప్పి యప్పొలంతి వీడ్కొని నిజగృహంబు
నకుం జనియె. నంత.

129


క.

కలఁగన్నయది యిత ననఁగ, నెలఁతకు నెల మసలె జగము నిఖిలంబును బే
రెలమిం బొందఁగఁ దగియెడు, నెల మసలం దెఱవచూలు నెలకొని బెలసెన్.

130


సీ.

ఉదరస్థుఁ డగుబాలునుజ్వలకాంతినా వెలిఁ బేర్చె నన మేను వెలరువాఱెఁ
గడుపులో నొప్పారు కొడుకునిర్మలబుద్ధి తెలుపనాఁ గనుఁగవ తెలుపువాఱె
గర్భశోభితుఁ డగునర్భకుసహజవిరక్తినాఁ జవులయాసక్తి దొరఁగె
లోనున్నసుతునివిలోకవిజ్ఞానంబు క్రమమనా నాభి వికాసమొందెఁ


గీ.

గుక్షిసంగతుఁ డగుపుత్రకునిగుణాలి, వొదలుతెఱఁగున మధ్యంబు పూర్ణమయ్యె
బూర్వజన్మసంచితతపఃపుణ్యఫలమ,హోదయంబునఁ జారుపయోజముఖికి.

131


క.

చాలఁగ నమృతము బాలుఁడు, గ్రోలుటకై నిలిచి కనకకుంభంబులపై
నీలపుఁగుప్పెను నిలిపిన, పోలికఁ జనుమొనలకప్పు పొలఁతికి నొప్పెన్.

132