పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

ద్విపద భారతము


పూని యా వేళ దుర్బుద్ధియై పవన
సూనునిచే జటాసురుఁ డెట్లుచచ్చె?
హనుమంతుతో భీముఁ డదియేల గూడె?
ధనదుసేనాపతిఁ దా నెట్లుచంపె ?
సంత నాతఁడువోయి యక్షుల గెలిచి,
కాంత సౌగంధికము నెట్లు దెచ్చె !
నతని యుద్ధతిఁ జూచి యమసూతితోడ
హితమతి ధననాథుఁ డేబుద్ధి చెప్పె :
దివి సస్త్రములుగాంచి తివిఱి నివాత
కవచుల నేరీతి ఖండించెఁ గ్రీడి ?
మఱి పాండవులు గంధమాదనంబరిగి
కొఱఁతగా కేవురుఁ గూడుటేలాగు ?
పాముచేఁదగిలి, యప్పవమానసూనుఁ
డేమియుఁగాక తా నెట్లు వెల్వడియె !
హరి యంతఁ బార్డుల నరయఁబోవుటయు
హరిదేవి యేమాటలాడె ద్రౌపదిని ?
రారాజు ఘోషయాత్రకు వచ్చి తగుల
నేరీతి విడిపించె నింద్ర నందనుఁడు ?
ప్రాయోపవేశంబు పన్నగధ్వజుఁడు
చేయఁ, గర్ణుం డేమిచెప్పెఁ బైనొత్తి ?
ద్రౌపదిఁ గొనిపోవు దండి సైంధవుని
నేపునఁ బావని యెట్లు భంగించె
ఘనులు పాండవు లంత గ్రమ్మఱి ద్వైత
వనమున కేరీతి వచ్చిరందఱును ?
దివిజదేవుండు భూదేవుఁడై పోయి
కవచకుండలములఁ గర్ణునెట్లడిగె !
యమధర్మరాజుతో నాధర్మరాజు
రమణ నేమని యంతరంబులు పలికె?