పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/663

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

597


సాహసాధికులార, సభ వారు వినుఁడు;
ద్రోహియైనట్టి యీదుశ్శాసనుండు
పాతకుఁడై దోషభాషణలాడి
నీతిదప్పి త్రిలోకనిందితుఁడగుదుఁ
దలవట్టి యీడ్చుక తద్దయువచ్చెఁ ;
దలఁపంగ నిది యుచితంబుకాదనక
యూరకయుండుట యుర్విధర్మంబె !
యారయ నోకరుణాంభోధులార ! "
యని 'భరతాన్వయం బతినింద్యమయ్యె .
ననుమాన మింతలే;' దనికృష్ణతలఁచి,
భయమందె ద్రౌపది పర్వేందువదన.
రయమున నపుడు నీరజలోచనుండు
కరుణించి ద్రౌపదిఁ గడుసంభ్రమమున
నరసి రక్షింపంగ నాత్మలోఁదలచె.
అపుడు త్రిలోకజయప్రతాపముల
నుపమవర్తింపుచునుండెడు పాండు-
రాజనందనుల పరాజయంబెల్ల
రాజితారుణనేత్ర రాజీవములను
వీక్షింపుచుండిన వెలఁదిఁ బద్మాక్షి
నీక్షించి దుఃఖించి యెంతయుఁగనలి
పాండవాగ్రజునితోఁ బవనజుండనియె:
"కొండలఁబోలిన కుంజరంబులను
జవహయంబుల రత్నసముదయంబులను
వివిధభూషణ వస్త్రవిసరంబు ధనము
సర్వసామ్రాజ్యంబు సకలార్థములను
బర్వేందువదనల బాణాయుధముల
నొగి మమ్ము నోడిన నోడితిగాక,
యగణితంబైన మాయాద్యూతమునను.