పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

595


గాంధారికడ కేఁగఁ గడుభయంబునను,
బంధుర సద్గుణాభరణయైనట్టి
యాకృష్ణపిఱుఁదున నరిగియిట్లనియె:
“నేకచిత్తమున నీవెచటి కేఁగెదవు ?
కొంకక చనుదెమ్ము కురురాజసభకు
శంకింప ; కున్నతి శకునిజూదమున
ధర్మనందనుఁడును దను నిన్నుఁ దనదు
కూర్మిసోదరులను గొనకొనియో డె;
నలి వేణి, కురుపతియర్థంబవైతి ,
వలయక యే తెమ్ము హర్షంబుతోడ."
ననుచు డాయఁగవచ్చుటంతయుఁ జూచి
వనజాక్షి ద్రౌపది వానితో ననియె:
"నేనురజస్వల; నేక వస్త్రంబు
పూని కట్టినదానఁ ; బుణ్యచరిత్ర,
ననుముట్టఁగా నీకు న్యాయంబుగాదు ;
గొనకొని యొక్కింతగుణము గ్రహించు;
మానాభిమానంబు మదిలోన విడిచి
మానిత కురువృద్ధమండలేశ్వరుల
ఘనసభాస్థలికెట్లు కడఁగిరా నేర్తు?”
ననిన ద్ర్పుపదితోడ నతఁడిట్టులనియె :
"ఏక వస్త్రంబు నీ విఁకఁగట్టి తేమి !
యేకవస్త్రముఁ గట్ట కిఁకనుండి తేమి !
యేకాత్మతోడ నీవేఁగుదెమ్మిపుడు ;
రాకున్న నిన్ను సంరంభంబుతోడ
బలవంతమునఁ డత్సభాస్థలంబునకు
నెలమిఁ గొంచునుబోదు నిదినిశ్చయంబు.
అనవుడు ద్రౌపది యతనితోఁబలికె:
“విను, ధర్మమార్గంబు వివరింపు; నన్ను