పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/660

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

594

ద్విపద భారతము.


యేకవస్త్రముగట్టి యెంతయుఁ జాల
శోకాకులతనొంది చుఱచుఱమనుచుఁ
గబరీభరముజూఱఁ గన్నీరుగాఱ
సొబగుదేహముగండ శూన్యతపొంద
వాతెఱయెండ భావముదూలియుండ
భీతిమిక్కిలిపట్టఁ బెనుదగదొట్టఁ
జెమటమేనునఁబుట్టఁ జింతదాఁబుట్ట
భ్రమచుట్టుముట్ట నాపద్మాయ తాక్షి
యరిగి యాకురువృద్ధునాస్థానమునను
దరలత్వముననుండె ద్రౌపది ; యంతఁ
బాండునందనులు ద్రౌపదిఁజూడలేక
నిండినలజ్జతో నిబిడదుఃఖముల
మోముదమ్ములు వాంచి ముఖముద్రలు పడ
నేమియు ననలేక యిట్లున్న యెడను,
బాండవేయుల దైన్యభావంబు చూచి
నిండినమదిఁ గురునృపకులోత్తముఁడు
సహజన్ముఁడైన దుశ్శాసనుఁ బిలిచి
బహుమానమొనరించి భక్తినిట్లనియె:
"ఎఱుక యించుకలేక యీప్రాతికామి
వెఱచు భీమునకును; వేడ్క నీవేఁగి
ద్రౌపదిఁ దో తెమ్ము తత్ క్షణంబునను

దుశ్శాసనుఁడు ద్రౌపదినిఁ దలపట్టి యీడ్చుకొనివచ్చుట

ఏపార." ననవుడు నెంతయు నతఁడు
చనియెను ముదమున సంభ్రమంబునను.
మునుకొని యంతట మొగిద్రౌపదియును
దురితాత్ముఁడైనట్టి దుశ్శాసనుండు
విరసుఁడై కొనిపోవ వే వచ్చుటెఱిఁగి