పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/655

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

589


ధర్మజుఁడు సర్వస్వము నోడుట

"దేవతాసీమలు దీపించువిప్ర
భూవలయంబును బుధపురంబులును
గుడ్డవృత్తులుఁదక్కఁ గుంభినియెల్ల
దొడ్డుగాఁగైకొను దోరంబుగాను
ఈజూదమాడి నేనిప్పుడోడినను
రాజితంబుగ. " నన్న రయమున శకుని
ధర్మజుతోడ జూదంబాడి గెలిచి
పేర్మితోఁ గైకొనెఁ బృథివీతలంబు.
వెండియు నొడ్డిన, విపులార్థములను
మండలాధిపుల సామంతభృత్యులను
దమ్ముల నత్యంతధర్మవర్తనుల
సమ్మదచిత్తుల సాహసాధికుల
నభిమానపురుషుల నర్క తేజులను
బ్రభుశేఖరుల జగత్ప్రఖ్యాతయశుల
సత్యవాక్యుల నాదిజగదీశనిభుల
నత్యుత్తముల సుగుణాంబురాసులను
బవమాననందనుఁ బర్జన్యసుతునిఁ
గవలను నోడెఁ దక్కకధర్మసుతుఁడు,
వివరింపఁ దన్నును వేగంబయోడెఁ
దవిలి యందంద ద్యూతవ్యసనమున.
ఆవేళ శకునియు యమనందనునకు
భావించి పలికెను బటుశఠత్వమున :
"ఓరాజశేఖర, యోధర్మతనయ,
వారకయోడితి వలయునర్థములు ;
కమలాక్షి పాంచాలకన్యక రూప
రమణీయ సంపూర్ణరాజబింబాస్య