పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

3


శౌనకాదులు మున్ను సత్రయాగంబు
నూనినరతిఁ జేయుచున్న, నచ్చటికి
నొకనాఁడు వేట్కతో నుగ్రశ్రవుండు
సకలపురాణార్థ సరసుఁడే తెంచి,
యనుపమభక్తి సాష్టాంగ ప్రణామ
మొనరించి, వారితో నోలి నందంద
సభినుతులొనరింప, నాశౌనకాదు
లభినవోత్సాహులై యతనిఁ బూజించి,
కుశలపీఠంబునఁ గూర్చుండఁ బెట్టి,
కుశలంబులడిగి, కోర్కులు దోపననిరి:
“ఇచ్చఁదలంచుచో నింతలో వేగ
వచ్చితివో సూత, వరకథాజాత.
ఆపరాశరసూతి కాత్మశిష్యుండు
చూపింప మీతండ్రి రోమహర్షణుఁడు
కనుఁగొని నీ వెఱుంగని పుణ్యకథలు,
విననియర్ధము లేదు విశ్వంబులోన.
నవిరళమహిమ మహాభారతంబు
చెవులకుఁ జవులుగాఁ జెప్పవే మాకు ,
అనఘ, గరుత్మంతుఁ డవనిఁబుట్టుటయుఁ,
జెనకి తాఁ దల్లి దాసీత్వంబు దీర్పఁ
దలఁచి యాఘనుఁ డమృతంబు దెచ్చుటయు,
గొలఁదిఁ దజ్జననిఁ దోడ్కొని పోవుటయుసు,
అమరదానవముఖ్యు లంబుధి ద్రచ్చి
యమృతంబుఁ బడసినయట్టి హేతువును,
వైనతేయుఁడు విష్ణువాహనంబైన
యామిత్తంబును, నదిగాక మఱియు,
లలి నిట్టికథకు మూల స్తంభమగుచుఁ
బొలుచు వేదవ్యాసుపుట్టు వేలాగు ?