పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

573


"పాండుపుత్త్రులమీఁద పక్షంబుకలిగి
యుండునువిదురుండు యుక్తంబుగాను ;
అతఁడేలశకునికార్యములకు లీల
క్షితిలోన నొడఁబడుఁ జింతించిచూడ ?
నుర్వీశ, యిందులకొడఁబడవేని,
సర్వభక్షకుఁజేతఁ జత్తునీక్షణమ ;
విదురుండు నీవును వేడ్కనుండుండు
హృదయంబులుప్పొంగి యెల్లకాలంబు. "
నని యడలుగమాటలాడినఁ జూచి
మనుజేశ్వరుండు కుమారునకనియె:
"నీకు విచారింప నెఱయంగ వలదు
చేకొని యొకరీతి చేసెదనింక ;
శిల్పకాచార్యులఁ జెలఁగి రప్పించి
కల్పింతు నొకసభ గౌరవంబునను.”
అని ధృతరాష్ట్రుండు నాక్షణంబునను
అనఘాత్ములను శిల్పకాచార్యవరుల
రప్పించి, హాటకరత్నహర్మ్యముల
నొప్పుగాఁదెప్పించి యురుతరచిత్ర
సన్మణిద్వారదేశములు నిర్మించి
సన్మోదముననుండుసమయంబునందు,
ధృతరాష్ట్రుఁడొకనాఁడు తెల్లమిగాను
మతిమంతు విదురుఁ గ్రమ్మనబిలిపించి
యేకాంతమున భక్తి నెల్లనుబలికి,
కైకొని శకునియుఁ గౌరవేశ్వరుఁడు
పలికినపలుకులు పరఁగఁజెప్పినను,
కలఁగి వే వివశుఁడై కడువడిఁదెలిసి