పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

488

ద్విపద భారతము


“ఇతని నపూర్వంబు నెయ్యదియైన
 నతిరూఢి నిర్మింప నానతియిండు.”
 అనినఁ బెద్దయుఁబ్రొద్దు నాత్మఁజింతించి
 వనజాతనేత్రుండు వారిజోదరుఁడు
 మయునకుఁబలికె సమ్మదచిత్తమునను :
 "గ్రియతోడఁ గురుపతికిని యుధిష్ఠిరున
 కధిపసంసేవ్యమై యమరినయట్టి
 పృథుసభ నిర్మించి పెంపుతోఁ దెమ్ము
 మహిమగా." ననవుడు మయుఁడిట్టులనియె:

మయసభానిర్మాణము


 "మహిలోనఁగల రాజమణులలోపలను
 బెద్దయై హరిజంభభేది లక్ష్ములకు
 నెందైన నధికుఁడై యీధర్మసుతుఁడు
 మించెఁగావున, సభ మిక్కిలి యేను
 గాంచన నవరత్న ఖచితమై యొప్ప
 నిర్మించితెచ్చెద నిఖిలంబునెఱుఁగ
 మర్మంబులైన విమానవైఖరుల.
 వృషపర్వుఁడను దైత్యవిభునకుఁ దొల్లి
 సుషమాభిరామమై శోభిల్లుసభను
 నిర్మింపసమకట్టి, నిఖిలరత్నములు
 భర్మంబు సమకూర్చి బహువిచిత్రములు,
 బిందు[1]సరంబను బిసరుహాకరము
 నందు దాఁచినవాఁడ; నన్నియు వేగఁ
 దెచ్చెద." ననుచు యుధిష్ఠిరుచేత
 నచ్చుగా సత్కృతుండై మయుండేఁగె.

  1. శతంబను (మూ)