పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

ద్విపద భారతము


రాజితకల్హారరాజిహస్తముల
నోజతోఁ దొలఁగించు నొక్కొకమాఱు;
వీక్షింప నీరీతి విలసిల్లు నేఱు
లక్షించి, కోలాహలం బనుకొండ
రతిరాజవశత నేర్పడఁ బాఁడు గలంగి,
సుతభిక్ష మిడద! నేఁ జూచెద, ననుచు
నెడపక యయ్యేటి కెలమి నడ్డంబు
వడినఁ, బ్రవాహంబు పాఱక నిలిచి,
'యుచితనాథునిఁ గూడి యుబ్బెనో,' యనఁగఁ
బ్రచురంబుగా నుబ్బి పట్టణంబునకు
బెదరుపుట్టించినఁ, బృథివీశుఁ డెఱిఁగి
తుదికాల నక్కొండఁ దొలఁగఁద్రోచినను,
అక్కిందనున్నవా రటమున్ను పుట్టి
రొక్కకూఁతురుఁ బుత్త్రుఁ డుత్తమాకృతులు.
మగవాని రాజుగా మత్స్యరాజ్యమున
దగనిల్పె నృపతి, యాతన్వికిఁ జొక్కి :
“గిరికినిబుట్ట నాగిరిజయుఁబోలె
గిరికాభిధానంబు కృతిమతిఁ దాల్చి,
నాధర్మపత్నివై, నవరత్నఖచిత
సౌధవీథుల యందుఁ జరియించు కాంత!”
అని దానిఁబెండ్లియై, యసమాస్త్రరతులఁ
దనియక, యొకనాఁడు ధరణీశ్వరుండు
వేటలోనుండియు, విరహతాపంబు
గాటమైయుండ నక్కాంతనే తలఁచె.
తలఁచినతలఁపు ప్రత్యక్షంబుకంటె
నెలకొని నిజమైన నెఱి నోర్వలేక,
మనసున రతిచేసి మదనాంబుధార
వినయంబు చాలక వెడలించి, దానిఁ