ద్రితముగా నున్న మరింగంటి కవుల రచనలలో నిది యొకటి.[1] ఈగ్రంథరచనాసమాప్తికాలము (1764) క్రీ. శ. 1839. ఆంగీరస సం॥ భాద్రపద శు. అష్టమీయని కవి తెల్పినాడు.
ఈ వెంకటనరసింహాచార్యులవి కొన్నిచాటుపద్యము లుండెనట. వానిలో రెండు మాత్రము మా తండ్రిగారి సంరక్షణలో నున్నవి. 'నల్లగొండ జిల్లా కవులు చాటువులు' (భారతి 1969 జూన్) అను వ్యాసమున వానిని ససందర్భముగా నుదహరించినాను.
7. చెన్నకృష్ణమాచార్యులు :- వెంకట నరసింహాచార్యుల సమకాలీనుడైన యీకవియు కనగల్లు వాస్తవ్యుడే యైనను కవిని గూర్చిన వివరములు తెలియుటలేదు. యాదగిరి నృసింహశతకము, మరికొన్ని రచనలు గలవట. అన్నియును అముద్రితములు. గో. క. సం. (399పు) యందును ఈ కవినిగూర్చిన విశేషవివరములు లేవు.
8. వరదదేశికులు:- గో.కం. సం. పేర్కొనబడని కవులలో నొకడైన యీ వరదదేశికులు షుమారు 150 సం. క్రిందివాడు. సరసకవి. సూర్యాపేట తాలూకాయందలి నరసింహాపుర మీతనినివాసస్థలము. శ్రీరామపాదుకాస్తవము[2], గోదాస్తుతి యను రెండు సంస్కృతరచన లీతనివి లభ్యమైనవి. రచన చాలా విలక్షణమైనది.
9. అప్పలదేశికులు:- శ్రీరామపాదుకాస్తవకర్తగా పేరుగాంచినవాడు. కాని యిది ఈయన రచనగారు. కర్తపేరులేని అర్వపల్లీనృసింహస్తోత్ర మొకటి[3] గలదు. దానిరచయిత అప్పలదేశికులవారే యని కొన్ని దృష్టాంతములతో ఈమధ్య తెలిసినది.
- ↑ తాలాంకనందినీపరిణయము- ఒక పరిశీలన (శ్రీ) (భారతి. 1967 డిసెంబర్).
- ↑ శ్రీరామపాదుకాస్తవము - మరింగంటి అప్పలదేశికులవారిపేర 1967 సెప్టెంబరు 'భారతి'యందు ప్రచురించినాను. కాని తరువాత లభించిన యాధారములవలన తత్కర్త వరదదేశికులవారని తెలిపిన మిత్రులు మరింగంటి పురుషోత్తమాచార్యులవారు. ‘గోదాస్తుతి'లోని కొన్ని శ్లోకములు వరంగల్లునందలి వైదికకళాశాల ప్రిన్స్ పాల్ శ్రీమాన్. న. చ. రఘునాథాచార్యులవారివద్ద గలవు.
- ↑ "అర్వపల్లీనృసింహస్తోత్రము" ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రిక. (ప్లవంగ.లమార్గశీర్ష - పుష్య.) సంచిక (శ్రీ).