పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

322

కార్మికుల ప్రవాహం


చేరాయి. ఇక యీ దిగులు వదిలింది. ఎక్కువ మంది జనం జైలుకు వెళ్లుటకు సిద్ధంగా లేరు. అయితే అంతా జాతి సమస్య పరిష్కారానికై సహాయం చేయుటకు సిద్ధంగా వున్నారు. చాలా మంది వాలంటీర్లుగా పని చేశారు. ఇంత మంది చదువురాని పేద భారతీయ కార్మిక స్త్రీ పురుషుల, బాలల సాయం కోసం ఎంతోమంది సుశిక్షితులైన స్వయం సేవకులు అవసరం అయ్యారు. అలాంటి వాళ్లు మాకు లభించడం విశేషమే. జనం తండోపతండాలుగా రాసాగారు. ఇంత మందిని పనిపాటలేకుండా ఒక్క చోట వుంచడం ఎంత ప్రమాదకరమో ఉహించవచ్చు. ఆ జనంలో రక రకాల వాళ్లు వున్నారు. దొంగతనం చేసి, హత్యలు చేసి, వ్యభిచారం చేసి, మలమూత్రాదులు ఎక్కడ బడితే అక్కడ విసర్జించి, తదితర తప్పు పనులు చేసి శిక్షలు అనుభవించిన వాళ్లు కూడా వారిలో వున్నారు. అయితే నేనెవరినీ ఏమి అడుగుటకు వీలులేని స్థితి . అడిగితే నిజం చెబుతారా? న్యాయనిర్ణేతను కాదు గదా! సమ్మె నడపడం వరకే నా పని. అందులో పాల్గొంటున్న వాళ్లు గతంలో ఎలాంటి వారో తెలుసుకోవడం నా పని కాదు. ఇలాంటి రకరకాల జనం పని ఏమీ లేకుండా ఒకచోట వుంటే ముప్పుకలగకుండా వుండటం సాధ్యం కాదు. అయితే భగవంతుని దయ అక్కడ వున్నన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి. అందరూ తమ తమ ధర్మాన్ని పాలించారు. శాంతికి సహకరించారు. అది గొప్ప చమత్కారమే.

ఇక నాకు నా సమస్యకు పరిష్కార మార్గం లభించింది. ఈ జనాన్ని ట్రాన్స్‌వాల్‌కి తీసుకు వెళ్లాలి. 16 మంది సత్యాగ్రహుల మాదిరిగా వీళ్లందరినీ అరెస్టు చేయించాలి. ఈ జనంతో ట్రాన్స్‌వాల్ యందలి జైళ్లు నిండిపోవాలి. ఇంతకంటే మించిన ఉత్తమ మార్గం నాకు మరొకటి కనబడలేదు. చిన్న చిన్న గుంపులుగా పంపుతామని ముందు అనిపించింది. కాని లాభం లేదని గ్రహించాను. మొత్తం అయిదు వేల మంది జనం - వీళ్లందరిని. రైల్లో తీసుకు వెళ్లడం కష్టం. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. అక్కడికి ట్రాన్స్‌వాల్ 36 మైళ్ల దూరాన వున్నది. చివరికి యాత్రకే నిర్ణయించాం. కార్మికులతో మాట్లాడాను. వారితో వారి భార్యాబిడ్డలు కూడా వున్నారు. అంతా నీళ్లు